ఎందుకు బాధ.. ఇంగ్లాండ్పై ఘోర ఓటమితో మనకెంత మంచి జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇంగ్లాండ్తో T20 సిరీస్లో 0-4 ఓటమి, ఐర్లాండ్తో 0-2 పరాభవం టీమిండియాకు మాయని మచ్చగా మిగిలింది. వరుసగా ఆరు మ్యాచ్లలో ఓటమి భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆటగాళ్లు, కోచ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సిరీస్లతో మనకు ఒక మంచి జరిగింది.

ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో 0-4 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కంటే ముందు ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20 సిరీస్లోనూ టీమిండియా 0-2తో ఓటమి పాలైంది. వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. టీమిండియా చేసిన ఈ చెత్త ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా రెండు సార్లు టీ20 ఛాంపియన్గా నిలిచిన జట్టు ఇలా పసికూన ఐర్లాండ్పై, ఆ తర్వాత ఇంగ్లాండ్పై వరుసగా మ్యాచ్లు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు భారత క్రికెట్ అభిమానులు. టీమిండియా ఆటగాళ్లపై, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లపై సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు.
కాస్త మంచి కూడా జరిగింది..!
బుద్ధుందా..? వరుసగా మ్యాచ్లు ఓడిపోతుంటే మంచి జరగడం ఏంటని తిట్టుకోకండి. అసలు మ్యాటర్ ఏంటంటే.. టీమిండియా ప్రదర్శనపై అభిమానులంతా ఆగ్రహంగా ఉన్నా.. ఈ సిరీస్ తర్వాత టీమిండియా సెలెక్టర్లు, బీసీసీఐ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక నుంచి ఐపీఎల్లో కెప్టెన్సీ చూసి ఏ ప్లేయర్కు కూడా నేరుగా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకెళ్లి అప్పగించేయరు. అలాగే ఆటగాళ్లను సోషల్ మీడియా డిమాండ్తో కాకుండా వారి దేశవాళి ప్రదర్శనతో నేషనల్ టీమ్కు ఎంపిక చేస్తారు. అలాగే సీనియర్ క్రికెటర్లకు జట్టులో కాస్త గౌరవం కూడా లభిస్తుంది. ఇక టీమిండియా పెత్తనం అంతా హెడ్ కోచ్ చేతుల్లో మాత్రమే ఉండకుండా జాగ్రత్త పడతారు.
ఇది ఐపీఎల్ కాదు..
ఇలా కొన్ని మంచి జరిగే అంశాలు కూడా ఈ సిరీస్ ఓటమితో జరిగే అవకాశం ఉందని, కొంతమంది ఆశావాహులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయినా వాళ్ల పిచ్చి కానీ, టీమిండియా ఎంత దారుణ ఓటములు ఎదుర్కొంటే ఏంటి.. వాళ్లు అనుకున్నదే వాళ్లు చేస్తారు. క్వాలిటీ ప్లేయర్లను కారణం లేకుండా పక్కన పెట్టేస్తారు. వాళ్లకు నచ్చిన ప్లేయర్లను తీసుకొచ్చి, ఇలా అంతర్జాతీయ వేదికలపై దేశం పరువు తీస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంగ్లాండ్కు చెందిన క్రికెట్ ఫ్యాన్స్, భారత క్రికెటర్లను ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో చూస్తే తట్టుకోవడం చాలా కష్టం. అంతెందుకు ఏకంగా గ్రౌండ్లోనే ఐపీఎల్ మ్యూజిక్ ప్లే చేస్తూ టీమిండియాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారీ భారీ సిక్సులు కొట్టేందుకు ఇవి ఇండియాలోని ఐపీఎల్ ఫ్లాట్ పిచ్లు కాదని, ఇంగ్లాండ్లో గ్రాసీ పిచ్లంటూ హేళన చేస్తున్నారు. ఇక్కడ ఆడాలంటే గుడ్డిగా బ్యాట్ ఊపితే సరిపోదు.. స్కిల్స్తో ఆడాలి. ఇక్కడ మా బౌలర్లను ఎదుర్కొవడం అంటే.. చిన్న గ్రౌండ్స్లో చెలరేగిపోవడం కాదు, నిప్పుతో చెలగాటమే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇంత జరిగినా.. ఇంకా మన సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు మారకుంటే, ఇలాంటి దారుణాలు ఇంకా చూడక తప్పదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
