
భారత జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ క్రికెట్కు తిరిగి వచ్చే సమయం మరింత ఆలస్యం కావచ్చని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. షమీ మోకాళ్లకు మళ్లీ వాపు ఏర్పడిందని, ఇది అతని గేమ్పై ప్రభావం చూపుతోందని నిన్న మ్యాచ్ తరువాత జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్ లో రోహిత్ పేర్కొన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన తర్వాత ఈ సమస్య మరోసారి ఎదురుకావడం, అతని పూర్తి స్థాయి పునరాగమనంపై సందేహాలు రేకెత్తిస్తోంది.
షమీ ఆటకు రావడం జట్టుకు ఎంతగానో అవసరం ఉన్నప్పటికీ, 100% ఫిట్నెస్ లేకుండా అతడిని ఆడించడం సరైనది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షమీ ఒకే సారి ఏడు మ్యాచ్లు ఆడడంతోపాటు, రంజీ ట్రోఫీ గేమ్లో 42 ఓవర్లు బౌలింగ్ చేసినట్లు సమాచారం. కానీ, ప్రతి మ్యాచ్ తర్వాత అతని మోకాళ్ల సమస్య తిరిగి వస్తుండడంతో అతను టెస్ట్ ఫార్మాట్కు పూర్తిగా సిద్ధంగా లేడని వైద్య బృందం తెలిపింది.
షమీకి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరాన్ని రోహిత్ హైలైట్ చేశాడు. అతని ఫిట్నెస్ను పర్యవేక్షించడానికి ఎన్సిఎ వైద్య బృందం నిత్యం పరిశీలన చేస్తోందని, తుది నిర్ణయం వారికే వదిలివేస్తామని రోహిత్ పేర్కొన్నారు. ఆటగాడిపై ఒత్తిడి పెంచడం జట్టుకు కూడా నష్టం కలిగించవచ్చని, అతడిని పూర్తిగా సిద్ధం చేసి తీసుకోవడం మేలని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
మహ్మద్ షమీ భారత జట్టు బౌలింగ్ విభాగానికి కీలక ఆటగాడిగా ఉండటంతో, అతని లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బే. కానీ, అతను పూర్తిగా కోలుకొని మళ్లీ పటిష్టమైన స్థితికి చేరుకోవడమే ముఖ్యమని రోహిత్ స్పష్టం చేశాడు. షమీకి తగిన సమయం ఇస్తూ, అతను జట్టుకు మళ్లీ సహాయపడే రోజులు దూరం లేవని చెప్పాడు.