Mumbai Indians: ముంబై కెప్టెన్గా సూర్యా భాయ్ ఖరారు.. మొత్తానికి ఆయన క్లారిటీ ఇచ్చేసినట్లేనా ?
Mumbai Indians: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమిస్తే జట్టుకు అపారమైన ప్రయోజనం చేకూరుతుందని మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన సక్సెస్ రేట్ ఉన్న సూర్యాకు ఐపీఎల్ నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టడం సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.

Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నారనే వార్తలు జోరందుకున్న వేళ, టీమిండియా మాజీ ఓపెనర్ సద్గోపన్ రమేష్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఆయన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమను ఆకాశానికెత్తేశారు. సూర్యా ఒక కెప్టెన్గా అద్భుతంగా రాణించాడని, ఆయనకు ఐపీఎల్లో ఏదో ఒక జట్టును నడిపించే అర్హత ఖచ్చితంగా ఉందన్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సూర్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే జట్టు సరికొత్త శిఖరాలను చేరుకుంటుందని స్పష్టం చేశారు.
అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించింది. ఆయన కెప్టెన్సీలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026తో పాటు ఆసియా కప్ను గెలుచుకుంది. భారత జట్టుకు 52 టి20 మ్యాచ్లలో నాయకత్వం వహించిన సూర్యా, ఏకంగా 40 మ్యాచ్లలో విజయాన్ని అందించగా, కేవలం 8 మ్యాచ్లలో మాత్రమే ఓటమి ఎదురైంది. ఐపీఎల్లో కూడా రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో 5 మ్యాచ్లకు సూర్యా నాయకత్వం వహించి 2 విజయాలు సాధించారు.
సంజూ శాంసన్ ఘటన.. సూర్యా సంస్కారం
సూర్యా నాయకత్వ శైలిని మెచ్చుకుంటూ సద్గోపన్ రమేష్ ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశారు. టీ20 వరల్డ్ కప్ సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాల్సి వచ్చినప్పుడు, సూర్యా స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. సాధారణంగా చాలామంది కెప్టెన్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆటగాళ్లతో నేరుగా మాట్లాడటానికి ఇష్టపడరని, కానీ సూర్యా మాత్రం జట్టు ప్రయోజనాల కోసం సంజూతో మాట్లాడి ఒప్పించారని రమేష్ కొనియాడారు. ఆ తర్వాత సంజూ శాంసన్ టోర్నీలో తిరిగి అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలవడం విశేషం.
కెప్టెన్సీ మార్పుపై సూర్యా తీవ్ర ఆవేదన
భారత జట్టుకు వరల్డ్ కప్, ఆసియా కప్ తెచ్చిపెట్టినప్పటికీ, గత రెండేళ్లలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోనప్పటికీ తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఇటీవల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “అంతా బాగున్నప్పుడు మార్పు ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. అసలు క్రికెట్ ఆడాలా వద్దా అనే సందేహం కూడా వచ్చింది. అయితే 20 ఏళ్ల క్రితం ఆటను ఎందుకు ప్రారంభించానో నా భార్య గుర్తుచేయడంతో మళ్లీ నాలో ఆ రక్తం ఉరికేలా చేసుకున్నాను” అని సూర్యా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
