Pakistan: మొత్తం టోర్నీ కాదు.. కేవలం భారత్ మ్యాచ్కే బహిష్కరణ ఎందుకు? పాక్ ప్లాన్ వెనుక అసలు రహస్యం ఇదే!
Pakistan: టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి ముందు పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాక్, మిగతా జట్లతో మాత్రం ఆడతామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నామని చెబుతున్నప్పటికీ, ఇందులో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Pakistan: బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చడానికి ఐసీసీ నిరాకరించడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలకు ‘హైబ్రిడ్ మోడల్’ను అనుసరించిన ఐసీసీ, ఇప్పుడు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటోందని పాక్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే “న్యాయం, సమానత్వం” కోసం భారత్తో మ్యాచ్ ఆడబోమని ఒక నిరసన చర్యగా ప్రకటించింది.
ఆదాయం కోసం ఒక దారి.. నిరసన కోసం మరో దారి: పాకిస్థాన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుంటే, పాక్ మొత్తం టోర్నీ నుంచే తప్పుకోవాలి. కానీ, కేవలం భారత్ మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి మిగతా మ్యాచ్లు ఆడటం ద్వారా ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని పీసీబీ వదులుకోవడం లేదు. ఐసీసీని విమర్శిస్తూనే, దాని వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను పొందడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రాజకీయ లబ్ధి కోసమేనా..?
భారత్-పాక్ మ్యాచ్కు ఉండే ప్రపంచవ్యాప్త క్రేజ్, ఆదాయం దృష్ట్యా పాక్ గతంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా బంగ్లాదేశ్కు మద్దతు పేరుతో కేవలం ఈ ఒక్క మ్యాచ్ను అడ్డుకోవడం వెనుక రాజకీయ లబ్ధి పొందే ఎత్తుగడ కనిపిస్తోంది. టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకుంటే ఐసీసీ కఠిన ఆంక్షలు విధిస్తుందని, అందుకే ఇలా కేవలం ఒక మ్యాచ్ను బహిష్కరించి తప్పించుకోవాలని పాక్ భావిస్తోంది.
ఐసీసీ ఆందోళన..
పాక్ నిర్ణయంపై ఐసీసీ తాజాగా స్పందించింది. జట్లు తమకు నచ్చిన ప్రత్యర్థులను ఎంచుకుని బహిష్కరిస్తే వరల్డ్ కప్ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో ఇలాంటి ఎంపిక చేసిన బహిష్కరణలు (Selective Boycotts) అంతర్జాతీయ క్రీడలకు ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ వ్యవహారాన్ని బీసీసీఐపై కాకుండా ఐసీసీపై నిరసనగా చిత్రించడం ద్వారా పాక్ నైతిక ఆధిక్యత సాధించే ప్రయత్నం చేస్తోంది.
పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక పోరాటంలా కాకుండా ‘నాటకీయ ప్రదర్శన’లా మారిందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐసీసీ కోరినట్లుగా పాక్ పునరాలోచన చేస్తుందా లేక తన మొండి వైఖరితో టోర్నీని సంక్షోభంలోకి నెడుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
