AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: కొత్త చరిత్ర లిఖించిన క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్! లార్డ్స్ వేదికగా అరుదైన ఘనత

స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 83 పరుగులు చేసి సెంచరీకి చేరువలో వెనుదిరిగినా, జట్టుకు కీలక సహకారం అందించింది.

Smriti Mandhana: కొత్త చరిత్ర లిఖించిన క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్! లార్డ్స్ వేదికగా అరుదైన ఘనత
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jul 11, 2026 | 11:25 AM

Share

క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో ఏకైక మహిళల టెస్టు తొలి రోజున ఆమె తన కెరీర్‌లో 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చరిత్ర సృష్టించింది. 29 సంవత్సరాల 357 రోజుల వయస్సులో ఈ మైలురాయిని చేరుకున్న మంధాన, భారత్ తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో మంధాన తన బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకుంది. 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు చేసింది.

సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అమీ జోన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో లార్డ్స్‌లో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి భారత మహిళగా నిలిచే అవకాశం తృటిలో చేజారింది. అయినప్పటికీ ఆమె ఇన్నింగ్స్ భారత్‌ను పోటీ స్కోరు దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. స్మృతి మంధాన అంతర్జాతీయ కెరీర్ 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ భారత మహిళల క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా ఎదిగింది.

ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4,538 పరుగులు, వన్డేల్లో 5,411 పరుగులు సాధించిన మంధాన, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత విజయాలకు ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించింది. టెస్టు క్రికెట్‌లో కూడా ఆమె రికార్డులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది టెస్టుల్లో 718 పరుగులు చేసిన మంధాన రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. లార్డ్స్ టెస్టులో సాధించిన పరుగులతో ఆమె మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, శుభాంగి కులకర్ణిలను అధిగమించి భారత తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో మహిళా బ్యాటర్‌గా నిలిచింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సైవర్-బ్రంట్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షఫాలీ వర్మ డకౌట్ అయినప్పటికీ మంధాన బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కూడా అర్ధశతకాలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌కు సమాధానంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు తొలి షాక్ ఇచ్చారు. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో టామీ బ్యూమాంట్ రెండు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఇంకా 264 పరుగులు వెనుకబడి ఉండటంతో రెండో రోజు ఆట ఇంట్రెస్టింగ్‌గా మారనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us