Team India Captain : గౌతమ్ గంభీర్ వర్సెస్ అజిత్ అగార్కర్.. సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
Team India Captain : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో జరగబోయే టీ20 సిరీస్లకు భారత జట్టు కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. ఈ రేసులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేరు దాదాపు ఖరారైనట్లు దైనిక్ జాగరణ్ నివేదిక పేర్కొంది.

Team India Captain : బీసీసీఐ మరో సంచలన నిర్ణయానికి తెరలేపినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన కొద్ది నెలలకే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించబోతున్నట్లు సమాచారం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో జరగబోయే టీ20 సిరీస్లకు భారత జట్టు కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. ఈ రేసులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేరు దాదాపు ఖరారైనట్లు దైనిక్ జాగరణ్ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ ద్వారా జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయానికి అధికారిక ముద్ర పడనుంది.
ఈ మార్పుల్లో భాగంగా కేవలం కెప్టెన్ మాత్రమే కాదు.. వైస్ కెప్టెన్ కూడా మారబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో తెలుగు క్రికెటర్, యువ సంచలనం తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించనున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు తిలక్ వర్మ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ ఎంపిక విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
సూర్య స్థానంలో సంజూ శాంసన్ను టీ20 కెప్టెన్గా చేయాలని కోచ్ గంభీర్ గట్టిగా పట్టుబట్టారు. అయితే, దీనికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదు. సంజూ శాంసన్ టాలెంటెడ్ అయినప్పటికీ, అతనికి ఆటలో స్థిరత్వం లేదనేది అగార్కర్ అభిప్రాయం. సెలెక్షన్ కమిటీలోని మిగిలిన సభ్యులు కూడా అగార్కర్ వాదనకే మద్దతు పలికారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించిన మాట నిజమే అయినా.. అతనిని దీర్ఘకాలిక కెప్టెన్గా చూడలేమని సెలెక్టర్లు స్పష్టం చేశారు. అంత పెద్ద బాధ్యతను ఇప్పుడే సంజూ భుజాలపై పెట్టడం తొందరపాటు అవుతుందని వారు భావించారు. దీంతో గంభీర్ ప్రతిపాదన వీగిపోగా.. శ్రేయస్ అయ్యర్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది.
వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. కానీ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టును కెప్టెన్గా ముందుండి నడిపించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓడిపోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు భారీ ఆరంభాన్ని అందుకున్నప్పటికీ, వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. అయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్ల్లో 168.81 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సహాయంతో 498 పరుగులు చేశాడు. ఇప్పుడు టీమిండియాలో సూర్యకుమార్ స్థానంలో నంబర్ 4 బ్యాటింగ్ పొజిషన్ను కూడా అయ్యర్ భర్తీ చేయనున్నాడు.
మరోవైపు ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును చాంపియన్గా నిలబెట్టిన రజత్ పాటిదార్కు ఈసారి కూడా భారత జట్టు నుంచి పిలుపు వచ్చేలా కనిపించడం లేదు. అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ, జట్టు ఎంపికలో అతని పేరుపై ఎలాంటి చర్చలు జరగలేదని నివేదిక పేర్కొంది. దీంతో పాటిదార్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
