Rohit Sharma: హిట్ మ్యానా లేక జైస్వాలా.. 2027 వరల్డ్ కప్పై బీసీసీఐ బిగ్ డిసిషన్.. ఆ రోజే తుది నిర్ణయం
Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ కొనసాగుతారా, యశస్వి జైస్వాల్కు అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. వెస్టిండీస్ వన్డే సిరీస్కు జట్టు ఎంపిక సందర్భంగా సెప్టెంబర్ 18 లేదా 19న సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Rohit Sharma: భారత వన్డే క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు ఏంటి, అతను 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మైండ్లలో మెదులుతోంది. ఈ ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే సమయంలో రోహిత్ భవిష్యత్తుపై సెలక్టర్లు ఒక స్పష్టమైన దిశను నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్లో దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో రాబోయే సెలక్షన్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
2027 వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లు దాటుతుంది. సుదీర్ఘకాల ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డేల్లో రెగ్యులర్ ఓపెనర్గా బరిలోకి దించాలని కొందరు సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోని ఆఖరి మ్యాచ్లో రోహిత్ శర్మ ఊచకోత కోస్తూ సాధించిన అద్భుతమైన సెంచరీతో తన అర్హతను మళ్లీ నిరూపించుకున్నాడు. తానప్పుడే అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికే ఆలోచనలో లేనని తన బ్యాట్తోనే హెచ్చరించాడు. దీనితో సీనియర్ ప్లేయర్ రోహిత్ను కొనసాగించాలా లేక భవిష్యత్తు కోసం జైస్వాల్ను సిద్ధం చేయాలా అనేది బోర్డుకు మింగుడుపడడం లేదు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ పుకార్లను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేసినప్పటికీ, లోపల ఏదో జరుగుతోందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ముఖ్య సెలక్టర్ అజిత్ అగార్కర్, ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే రోహిత్కు భవిష్యత్తు ప్రణాళికలపై ఒక స్పష్టమైన సందేశం పంపారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన కీలక సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు బోర్డు పెద్దలు హాజరైనప్పటికీ అజిత్ అగార్కర్ గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సెలక్షన్ వ్యవహారాల్లో బోర్డు జోక్యం పెరిగిపోవడం వల్లే అగార్కర్ అసంతృప్తిగా ఉన్నారని నెట్టింట చర్చ సాగుతోంది.
సెప్టెంబర్ 18 లేదా 19 తేదీల్లో అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో వెస్టిండీస్ వన్డే సిరీస్కు జట్టును ఎంపిక చేయడంతో పాటు రోహిత్ శర్మ పాత్రపై క్లారిటీ రానుంది. ఒకవేళ రోహిత్ను ఈ సిరీస్కు ఎంపిక చేస్తే, అతనికి 2027 వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశాలు మెరుగవుతాయి. అలా కాకుండా జైస్వాల్కు ప్రాధాన్యత ఇస్తే మాత్రం టీమిండియా వన్డే జట్టులో ఒక సరికొత్త అధ్యాయం మొదలైనట్లే భావించాలి. ఈ ప్రకటన కేవలం ఒక సిరీస్ ఎంపిక మాత్రమే కాకుండా భారత క్రికెట్ భవిష్యత్తును మార్చే మలుపుగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
