AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant Car Accident: డివైడర్‌ను ఢీకొట్టిన రిషబ్ పంత్‌ కారు.. అర్ధరాత్రి ప్రమాదానికి కారణం ఇదే..

రూర్కీలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీకి రెఫర్ చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై..

Rishabh Pant Car Accident: డివైడర్‌ను ఢీకొట్టిన రిషబ్ పంత్‌ కారు.. అర్ధరాత్రి ప్రమాదానికి కారణం ఇదే..
Rishabh Pant Accident
Sanjay Kasula
|

Updated on: Dec 30, 2022 | 11:26 AM

Share

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు చికిత్స కొనసాగుతోంది. తెల్లవారుజామున రిషబ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్‌ NH-58పై ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మెర్సిడెస్‌ కారును పంతే నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి..? అతి వేగమే కారణమా..? ఓవర్‌ స్పీడ్‌తో డ్రైవింగ్‌ వల్లే కారును కంట్రోల్‌ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టారా..? లేక నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా..? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే ప్రమాదం టైమ్‌లో పంత్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్నాడా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.

ప్రమాదంలో కారు పూర్తిగా తగలబడిపోయింది. అదృష్టవశాత్తూ పంత్‌ దాన్నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే కంటికి గాయమైంది. వీపుపైన మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతో.. డివైడర్‌పై ఉన్న రెయిలింగ్‌ కూడా కొన్ని మీటర్ల వరకూ విరిగిపోయింది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో మండుతున్న కారు అద్దాల్ని ప‌గుల‌గొట్టి.. రిషబ్‌ పంత్‌ బ‌య‌ట‌కు దూకిన‌ట్లు తెలిపారు పోలీసులు. రాత్రి ప్రయాణం కావడంతో కాస్త నిద్రమత్తు వచ్చిందని.. రెప్పపాటులోని ప్రమాదం జరిగిందని వెల్లడించారు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌.

రిషబ్ పంత్ ప్రమాదం తర్వాత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన వెలువడించారు. అవసరమైతే రిషబ్ పంత్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేస్తానని చెప్పారు. అవసరాన్ని బట్టి అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ ఆడారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. నాలుగు రోజుల క్రితం క్రిస్మస్‌ వేడుకలను పంత్‌.. మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి దుబాయ్‌లో జరుపుకున్నారు. ముఖ్యంగా రిషబ్ టీమ్ ఇండియాతో కలిసి బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాడు. అయితే గాయం కారణంగా అతనికి విరామం లభించింది. శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కూడా పంత్‌కు విరామం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం