IND vs NZ: తొలి మ్యాచ్కు ముందే చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్.. ఆ వీడియోతో వివాదం షురూ..
Rinku Singh Controversy: టీమిండియా యంగ్ సెన్సేషన్, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ఒక అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్కు సన్నద్ధమవుతున్న తరుణంలో, ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఏఐ (AI) వీడియో మతపరమైన చర్చకు దారితీసింది. హిందూ దేవుళ్లను అభ్యంతరకరంగా చూపించారంటూ కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది.

Rinku Singh Facebook Video: మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రింకూ సింగ్, ప్రస్తుతం ఒక నెగిటివ్ వివాదంతో వార్తల్లో నిలిచారు. తన ఎదుగుదలకు దైవకృప కారణమని భావించే రింకూ, ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియో ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
అసలు వివాదం ఏమిటి?
రింకూ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో.. ఆయన క్రికెట్ ఆడుతున్న విజువల్స్ తో పాటు కొన్ని ఏఐ క్రియేటెడ్ చిత్రాలు ఉన్నాయి. అందులో హిందూ దేవతలైన విష్ణువు, శివుడు, గణేశుడు మోడరన్ లుక్ లో సన్ గ్లాసెస్ ధరించి కారులో కూర్చున్నట్లు, ఆ కారును హనుమంతుడు నడుపుతున్నట్లు చిత్రీకరించారు. “నిన్ను క్రికెటర్గా ఎవరు చేశారో తెలుసా?” అనే క్యాప్షన్తో భక్తి భావంతోనే రింకూ ఈ వీడియోను పెట్టినప్పటికీ, ఇది కొందరి మనోభావాలను దెబ్బతీసింది.
కర్ణిసేన తీవ్ర అభ్యంతరం – ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్..
ఈ వీడియోపై ‘కర్ణిసేన’ తీవ్రంగా స్పందించింది. దేవుళ్లకు నల్ల కళ్లజోడు పెట్టి, ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడం సనాతన ధర్మాన్ని కించపరచడమేనని వారు మండిపడుతున్నారు. అలీగఢ్లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్లో రింకూ సింగ్పై కర్ణిసేన ఫిర్యాదు చేసింది.
కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ మాట్లాడుతూ.. “రింకూ సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. హిందూ మత విశ్వాసాలతో ఆడుకోవడం సరికాదు” అని హెచ్చరించారు. రింకూ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.
పోలీసుల స్పందన..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఆ వీడియోను నిజంగా రింకూ సింగ్ ఖాతా నుంచే పోస్ట్ చేశారా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు. వీడియో ప్రామాణికతను నిర్ధారించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్చార్జ్ వెల్లడించారు.
వరల్డ్ కప్ ముందు ఒత్తిడి..
ప్రస్తుతం రింకూ సింగ్ నాగ్పూర్లో ఉన్నారు. న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్తో పాటు, రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు ఆయన కీలక ఆటగాడు. ఇలాంటి సమయంలో ఇలాంటి వివాదాలు ఆయన ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తితో చేసిన పని విమర్శలకు దారితీయడంపై రింకూ అభిమానులు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై రింకూ సింగ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెబితే ఈ గొడవ సద్దుమణిగే అవకాశం ఉంది. మరి ఈ స్టార్ క్రికెటర్ ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




