Pakistan: ఇక మారరా.. కోచ్తో పాక్ కెప్టెన్ వాగ్వాదం.. కోపంతో ఏం చేశాడో తెలుసా?
Salman Agha argument video: నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ డగౌట్లో కోపంగా కనిపించాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై చర్చలు హీటెక్కింది. పాక్ కెప్టెన్ ఆఘా ఏదో విషయంపై కోపంతో బాటిల్ విసిరేశాడు. దీనిపై మాజీలు పాక్ కెప్టెన్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Salman Agha argument: టీ20 వరల్డ్ కప్ 2026లో నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా డగౌట్లో ఆగ్రహానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆఘా ఏదో విషయంపై కోపంతో బాటిల్ విసిరేయడం కనిపించగా, అతడి పక్కనే బాబర్ ఆజమ్, హెడ్ కోచ్ మైక్ హెస్సన్ నిలబడి ఉన్నారు. ఆఘా ఆగ్రహానికి కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఆ సమయంలో హెస్సన్ ఆశ్చర్యానికి గురై, ఆఘాకు శాంతంగా ఉండాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ మాటలకు ఆఘా తల ఊపుతూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోపై స్పందించిన మాజీ భారత క్రికెటర్ ప్రియాంక్ పంచాల్.. ఇది ఎంతో “బాధాకరం”గా అభివర్ణించాడు. విదేశీ కోచ్లతో పాకిస్థాన్ జట్టుకు ఉన్న సంస్కృతి, వ్యవహారశైలి పట్ల కూడా ఆయన ప్రశ్నలు సంధించాడు.
“మైక్ హెస్సన్, సల్మాన్ ఆఘా వాగ్వాద వీడియో బాధాకరం. హెస్సన్ ఇటీవలి కాలంలో అత్యంత చురుకైన క్రికెటర్లలో ఒకరు. అవసరమైన గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్థర్, కిర్స్టెన్, గిల్లెస్పీ లాంటి అనుభవజ్ఞులైన విదేశీ కోచ్లను ఎందుకు తీసుకుంటోంది?” అని పంచాల్ ‘ఎక్స్’లో రాసుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, పాకిస్థాన్ నమీబియాపై 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెంచరీ సాధించిన రెండో పాకిస్థాన్ బ్యాట్స్మన్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
The argument video of Mike Hesson and Salman Agha is painful. He’s one of the most astute cricketing brains of recent times! Pakistan shouldn’t go for seasoned foreign coaches like Arthur, Kirsten, Gillespie if they cannot accord them the required respect! #INDvsPAK
— Priyank Panchal (@PKpanchal09) February 18, 2026
ఫర్హాన్ సెంచరీతో పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. అనంతరం నమీబియాను 97 పరుగులకే ఆలౌట్ చేసి తదుపరి దశకు దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, “ఇది సంపూర్ణ ప్రదర్శన. పవర్ప్లేలో, మధ్య ఓవర్లలో కూడా బాగా బ్యాటింగ్ చేశాం. ఫర్హాన్ కొంతకాలంగా మంచి ఫామ్లో ఉన్నాడు. అతడు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. మన వద్ద నాణ్యమైన స్పిన్నర్లు, బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లు ఉన్నారు. శ్రీలంకలో ఇలాంటి స్పిన్నర్లు ఉంటే పేస్ బౌలింగ్ గురించి ఎక్కువగా ఆందోళన అవసరం లేదు,” అని అన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
