
IPL 2026 Orange Cap Race: ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్ల హోరు. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వంటి దిగ్గజాలు ఉంటారని అందరూ భావించారు. కానీ, ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ముందు వరకు సంజూ శామ్సన్ ఈ రేసులో ఎక్కడో 22వ స్థానంలో ఉన్నాడు. కానీ, ఒక్క ఇన్నింగ్స్ ఆయన తలరాతను మార్చేసింది. మైదానంలో శామ్సన్ సృష్టించిన విధ్వంసం ధాటికి ఏకంగా 19 మంది బ్యాటర్లు వెనక్కి నెట్టాడు.
వాంఖడే స్టేడియంలో సంజూ శామ్సన్ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సుమారు 109 నిమిషాల పాటు క్రీజులో నిలబడిన శామ్సన్, ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో ఆయన కేవలం 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో శామ్సన్కు ఇది రెండో శతకం కావడం గమనార్హం. ఒకప్పుడు పరుగుల కోసం తడబడిన చోటే, ఇప్పుడు పరుగుల వరద పారించి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ జాబితాను పరిశీలిస్తే, యువ సంచలనం అభిషేక్ శర్మ 7 మ్యాచ్ల్లో 323 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన ఖాతాలో ఒక శతకం, రెండు అర్థశతకాలు ఉన్నాయి. రెండో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 320 పరుగులతో ఉన్నారు. అయితే, తాజా సెంచరీతో సంజూ శామ్సన్ 293 పరుగులకు చేరుకుని నేరుగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. తర్వాతి స్థానాల్లో వైభవ్ సూర్యవంశీ (254 పరుగులు), విరాట్ కోహ్లీ వంటి వారు ఉన్నారు.
యువరాజ్ సింగ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మకు ఇప్పుడు సంజూ శామ్సన్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. రాబోయే మ్యాచ్ల్లో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆరెంజ్ క్యాప్ కోసం జరిగే పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. శామ్సన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే, అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని కాపాడుకోవడం కష్టమనే చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..