IPL 2025: ఎక్కడికి వెళ్ళేది లేదు.. సౌత్ ఇండియాలోనే IPL! లిస్ట్ లో హైదరాబాద్..
భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా IPL 2025ని తాత్కాలికంగా వారం పాటు నిలిపివేశారు. టోర్నీ మిగిలిన భాగాన్ని సౌత్ ఇండియాలోని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటివెేదికలపై నిర్వహించే యోచనలో BCCI ఉంది. భద్రతా పరిస్థితులు మెరుగుపడకపోతే యూకే కూడా ప్రత్యామ్నాయ వేదికగా భావిస్తున్నారు.

భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025ను BCCI తాత్కాలికంగా వారం పాటు నిలిపివేయాల్సి వచ్చింది. మే 9న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకస్మికంగా ఏర్పడిన అత్యవసర భద్రతా పరిస్థితుల కారణంగా మ్యాచ్ను మధ్యలోనే ఆపేయడం, టోర్నమెంట్ మొత్తానికే బ్రేక్ పడేలా చేసింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రత, లాజిస్టికల్ సవాళ్లు, దేశవ్యాప్తంగా నెలకొన్న సున్నిత వాతావరణం ఇవన్నీ కారణాలు BCCI ని ఈ నిర్ణయం తీసుకునేలా చేసాయి.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంట్ మిగిలిన భాగాన్ని కొనసాగించేందుకు BCCI ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోంది. క్రిక్ట్రాకర్ నివేదిక ప్రకారం, సరిహద్దు పరిణామాలను బోర్డు నిత్యం పర్యవేక్షిస్తుండగా, భారతదేశంలో సాపేక్షంగా సురక్షితంగా భావించబడుతున్న నగరాల్లో మిగతా మ్యాచులను నిర్వహించే దిశగా చర్చలు జరుపుతోంది. కోల్కతా (ఈడెన్ గార్డెన్స్), చెన్నై (చెపాక్ స్టేడియం), హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బోర్డు ఇప్పటికే ఒక అత్యవసర ప్రణాళికను రూపొందించగా, పరిస్థితులు చక్కబడితే, IPL 2025 మళ్లీ అదే ఉత్సాహంతో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, సరిహద్దు పరిస్థితులు మరింతగా దిగజారితే, IPL మ్యాచ్లను పూర్తిగా భారత్లో నిర్వహించడం కష్టంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో, ఇండియన్ క్రికెట్ బోర్డుకు మరో ఆఫర్ యునైటెడ్ కింగ్డమ్ (UK) నుండి వచ్చిందనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) IPL 2025 మిగిలిన మ్యాచ్లను యూకే వేదికగా నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది. ఇది ఒక బ్యాకప్ ప్రణాళికగా పరిగణించబడుతోంది, ముఖ్యంగా జూన్ 20 నుండి భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడం, అలాగే భారత్లో భద్రతా పరిస్థితులు ఎలా ఉంటాయో స్పష్టత లేని సమయంలో.
ప్రస్తుతం టోర్నమెంట్లో పన్నెండు లీగ్ దశ మ్యాచ్లు మరియు నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు మిగిలి ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని వీటిని గడువులోపు పూర్తి చేయడం BCCIకి ఓ పెద్ద సవాలుగా మారింది. దేశీయంగా నిర్వహించే ప్రాధాన్యత ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోతే యూకే వంటి బాహ్య వేదికలే తాత్కాలిక పరిష్కారంగా మారవచ్చు. ఇలా చూస్తే, రాబోయే రోజులు BCCIకి ఎంతో కీలకంగా మారనున్నాయి, ఎందుకంటే ఈ నిర్ణయమే IPL 2025 భవిష్యత్తు దిశను నిర్ధారించనుంది.
ఇకపోతే, ధర్మశాలలో ఆపిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా IPL తిరిగి ప్రారంభమైన తర్వాత తిరిగి నిర్వహించనున్నట్లు సమాచారం. మ్యాచ్ను మొదటి నుంచి ప్రారంభిస్తారా లేదా అక్కడే ఆపిన స్థితి నుండి కొనసాగిస్తారా అన్నదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేయగా, సడెన్ బహిరంగ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో HPCA స్టేడియంను ఖాళీ చేయించారు. ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులందరిని సురక్షితంగా తరలించడం అత్యవసరమైంది. ఆ తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు సహాయక సిబ్బందితో కలిసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా ఢిల్లీకి తరలించబడ్డారు. ఈ ఘటన తర్వాత, BCCI భవిష్యత్తులో ఇలాంటి సందర్భాల్లో మరింత శీఘ్ర స్పందన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..