ముంబై ఇండియన్స్కు ఐపీఎల్ 2025లో నిరాశాజనకమైన ఆరంభం ఎదురైంది. టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్లోనే వారిపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలి పరాజయాన్ని మరిచి, టోర్నమెంట్లో తొలి విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్తో నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్కు నిషేధం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా, ఈసారి మళ్లీ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టుకు కెప్టెన్గా తిరిగి వచ్చిన అతడు, జట్టును విజయపథంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
మ్యాచ్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హార్దిక్ పాండ్యా మైదానంలోకి దిగిన సమయంలో అతని ప్రేయసి జాస్మిన్ వాలియా స్టాండ్స్లో కనిపించడం. బ్రిటిష్ సింగర్, టీవీ సెలబ్రిటీ అయిన వాలియా, ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి పక్కనే కూర్చొని మ్యాచ్ను ఆసక్తిగా వీక్షించింది.
పాండ్యా, వాలియా మధ్య సంబంధంపై మళ్లీ చర్చ
హార్దిక్ పాండ్యా తన భార్య, సెర్బియన్ డాన్సర్, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకున్న తర్వాత జాస్మిన్ వాలియాతో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మ్యాచ్ సందర్భంగా వాలియా స్టేడియంలో కనిపించడంతో, వారి సంబంధం మరోసారి హాట్ టాపిక్గా మారింది.
పాండ్యా మళ్లీ ముంబైకి ఆశాజనకంగా
హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరడంపై ముంబై ఇండియన్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతని సీనియర్ అనుభవం, కెప్టెన్సీ నైపుణ్యం జట్టుకు ఉపయోపడుతుందని నమ్మకంగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా 2025 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహించిన అతడు, 2022లో జట్టును చాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత 2024 ఐపీఎల్ ముందుగా, గుజరాత్ నుంచి ముంబైకి ట్రేడ్ అయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా నియమితుడయ్యాడు.
అయితే, కెప్టెన్సీ మార్పుపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ రావడం కొంత మంది అభిమానులను నిరాశపరిచింది. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై, గుజరాత్ టైటాన్స్తో జరిగిన రెండో మ్యాచ్లో విజయం కోసం పోరాడింది.
హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా మాత్రమే కాకుండా, నాయకుడిగా తన ప్రతిభను 2022లో గుజరాత్ టైటాన్స్ విజయంతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.