AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Zimbabwe : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్ల వారీగా ఎంపికైన ఆటగాళ్లు వీరే

India Vs Zimbabwe : జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత టీ20 జట్టు లో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి ఎంతమంది ఆటగాళ్లు ఎంపికయ్యారో తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ ఆధిపత్యం చెలాయించగా , ఆర్‌సీబీకి ఒక్క ఆటగాడికీ చోటు దక్కలేదు.

India Vs Zimbabwe : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్ల వారీగా ఎంపికైన ఆటగాళ్లు వీరే
India Vs Zimbabwe
Rakesh
|

Updated on: Jul 07, 2026 | 8:58 PM

Share

India Vs Zimbabwe : బీసీసీఐ జింబాబ్వే పర్యటన కోసం సరికొత్త టీ20 జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా యంగ్ ప్లేయర్లతో కూడిన స్ట్రాంగ్ టీంను ఎంపిక చేసింది. సాధారణంగా భారత టీ20 జట్టులోకి రావాలంటే ఐపీఎల్ ఒక పెద్ద బెంచ్‌మార్క్‌గా మారుతుంది. ఇందులో రాణించిన వారికే సెలెక్టర్లు పెద్దపీట వేస్తారు. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీల వారీగా చూస్తే కొన్ని జట్లకు భారీ ప్రాతినిధ్యం దక్కగా, మరికొన్ని జట్లకు తీవ్ర నిరాశే ఎదురైంది.

పంజాబ్ కింగ్స్ నుంచి నలుగురు.. ఆర్‌సీబీ నుంచి సున్నా

ఈ పర్యటనకు ఎంపికైన జట్టులో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ అత్యధికంగా నలుగురు ఆటగాళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడుతున్నాడు. అతనితో పాటు ఐపీఎల్ 2026లో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 175.56 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేసిన యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గేకు చోటు దక్కింది. అలాగే ఐపీఎల్‌లో 510 పరుగులు బాదిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, వికెట్లు తీసే నైపుణ్యం ఉన్న పేసర్ యష్ ఠాకూర్‌లు పంజాబ్ కోటాలో జట్టులోకి వచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడిని కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ముగ్గురు సంచలనాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లకు భారత జట్టులో అవకాశం లభించింది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ, ఐపీఎల్ 2026లో 15 మ్యాచ్‌ల్లో 563 పరుగులు చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతనితో పాటు ఐపీఎల్‌లో 182.42 స్ట్రైక్ రేట్‌తో 602 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే కూడా 8 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి ఈ టూర్‌కు టికెట్ సంపాదించాడు.

కేకేఆర్, లక్నోల నుంచి ఇద్దరేసి యువ సింహాలు

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు ఎంపికయ్యారు. కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో చక్కగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ రింకూ సింగ్ (ఐపీఎల్‌లో 296 పరుగులు) తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నుంచి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల ఎక్స్‌ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్, అలాగే ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న రైట్ ఆర్మ్ పేసర్ ప్రిన్స్ యాదవ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

వైభవ్ సూర్యవంశీతో పాటు తిలక్ వర్మ, శివం దూబేలకు జట్టులో చోటు

మిగిలిన ఫ్రాంచైజీల విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి పవర్‌ఫుల్ హిట్టర్ శివం దూబే ఏకైక ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2026లో 158.82 స్ట్రైక్ రేట్‌తో ఆడటమే ఇతనికి ప్లస్ పాయింట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్, పలు అవార్డులు గెలుచుకున్న స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జట్టులోకి దూసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ (MI) నుంచి ఒకే ఒక్కడిగా మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో అతను ఒక సెంచరీతో సహా 359 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల యువ పేసర్ అశోక్ శర్మను జట్టులోకి తీసుకున్నారు.

జింబాబ్వే టూర్‌కు భారత పూర్తి జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us