ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!

Shubman Gill Statement on 40 Over ODI Cricket: శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన టీమిండియా సరికొత్త వ్యూహాలతో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సిరీస్‌లో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. భవిష్యత్తు ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs Eng Shubman Gill Press Conference

Updated on: Jul 14, 2026 | 1:52 PM

Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన విషయాలు వెల్లడించారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగింపుపై స్పష్టతనిస్తూనే, వన్డే క్రికెట్ ఫార్మాట్ మార్పులపై ఐసీసీ ప్రతిపాదనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

టీమిండియా భవిష్యత్తు ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లపై గిల్ క్లారిటీ!

భారత క్రికెట్ అభిమానులను చాన్నాళ్లుగా వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా? ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ మాట్లాడుతూ, ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు సిద్ధం చేసుకుంటున్న ప్రణాళికల్లో అత్యంత కీలకమైన భాగమని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

ఇవి కూడా చదవండి

రెండు రోజుల క్రితమే తాను విరాట్ కోహ్లీతో రాబోయే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్ గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు గిల్ వెల్లడించారు. భవిష్యత్తులో జట్టుకు ఉపయోగపడే యువ బౌలర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లను ఎలా సిద్ధం చేసుకోవాలనే దానిపై స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచిన రోహిత్, విరాట్ అనుభవం, విభిన్న పరిస్థితుల్లో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే వారి శైలి యువ ఆటగాళ్లకు కొండంత అండ అని గిల్ కొనియాడారు.

40 ఓవర్ల వన్డే ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత..

ఇటీవల ఐసీసీ వార్షిక సమావేశంలో వన్డే క్రికెట్‌పై ఆసక్తిని పెంచడానికి మ్యాచ్‌లను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలనే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో గిల్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వన్డేల ఓవర్లను తగ్గించడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఓవర్లు తగ్గించడం కంటే, మూడు లేదా నాలుగు దేశాలు పాల్గొనే ‘ట్రై-సిరీస్’ లేదా ‘క్వాడ్రాంగ్యులర్ సిరీస్’లను ఎక్కువగా నిర్వహించాలని క్రికెట్ బోర్డులకు గిల్ సూచించారు.

టీ20 పరాజయాల ప్రభావం వన్డేలపై ఉండదు..

ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్‌లలో భారత్ ఎదుర్కొన్న ఓటములపై కెప్టెన్ స్పందించారు. టీ20, వన్డేలు రెండూ పూర్తిగా భిన్నమైన ఫార్మాట్‌లని, ఆ పరాజయాల ప్రభావం ప్రస్తుత వన్డే సిరీస్‌పై ఎంతమాత్రం ఉండదని స్పష్టం చేశారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేయడం బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇచ్చిందని, సరికొత్త ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో తాము బరిలోకి దిగుతున్నామని గిల్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి సమరం నేడు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ద్వితీయ వన్డే జూలై 16న కార్డిఫ్‌లో, చివరి మ్యాచ్ జులై 19న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన టీమిండియా సరికొత్త వ్యూహాలతో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సిరీస్‌లో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. భవిష్యత్తు ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us