AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్ చేతిలో ఘోర పరాభవం.. పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు

IND vs PAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత కచ్చితమైన బౌలింగ్ దాటికి తాళలేక 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ మహిళల జట్టుకు ఇదే అత్యంత తక్కువ స్కోరు కావడం గమనార్హం.

IND vs PAK: భారత్ చేతిలో ఘోర పరాభవం.. పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు
Ind Vs Pak (2)
Rakesh
|

Updated on: Sep 06, 2026 | 1:44 PM

Share

IND vs PAK: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత బౌలర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి, తమ ఆధిపత్యాన్ని సగర్వంగా చాటుకున్నారు. మహిళల ఆసియా కప్ తొమ్మిదో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత కచ్చితమైన బౌలింగ్ దాటికి తాళలేక 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ మహిళల జట్టుకు ఇదే అత్యంత తక్కువ స్కోరు కావడం గమనార్హం. గతంలో 2024 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 56 పరుగుల రికార్డును అధిగమించి, ఈ మ్యాచ్ ద్వారా సరికొత్త చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకుంది.

ఇన్నింగ్స్ ఆరంభంలో పాకిస్థాన్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా మొదటి నాలుగు ఓవర్లలో 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అయితే తొలి ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన భారత స్టార్ ఆల్‌రౌండర్ షెఫాలీ వర్మ వెంటనే వికెట్ తీసి విచ్ఛిన్నానికి నాంది పలికింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ 23/0 నుంచి 29/3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అక్కడి నుంచి భారత స్పిన్ విభాగానికి తిరుగులేకుండా పోయింది.

పవర్‌ప్లే తర్వాత భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి మైదానంలో వికెట్ల పండగ చేసుకున్నారు. వీరి ధాటికి పాకిస్థాన్ స్కోరు 27/0 నుంచి ఒక్కసారిగా 35/6కి పడిపోయింది. ఉమ్మా-ఎ-హానీ, ఐమన్ ఫాతిమా కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఒక రనౌట్ రూపంలో వారి పోరాటం ముగిసింది. ఆఖరి వరుస బ్యాటర్లు కూడా క్యూ కట్టడంతో పాక్ ఇన్నింగ్స్ 55 పరుగుల వద్దే ముగిసింది.

భారత్‌పై నమోదైన ఐదో అత్యల్ప స్కోరు

పాకిస్థాన్ నమోదు చేసిన 55 పరుగుల స్కోరు వారికి ఆల్-టైమ్ లోయెస్ట్ కాగా, భారత మహిళల జట్టుపై ప్రత్యర్థులు చేసిన ఐదో అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ జాబితాలో 2018లో క్ౌలాలంపూర్‌లో భారత్‌పై 27 పరుగులకే ఆలౌట్ అయిన మలేషియా అగ్రస్థానంలో ఉండగా, థాయిలాండ్ (37 పరుగులు), బంగ్లాదేశ్ (51, 54 పరుగులు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై విజయం సాధించి ఆసియా కప్‌లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్‌కు, భారత్ చేతిలో ఎదురైన ఈ ఘోర పరాభవం కోలుకోలేని దెబ్బగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us