AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 5th T20I : టీమిండియా బౌలర్లను ఉతికేసిన బ్రూక్, బట్లర్.. టీమిండియా టార్గెట్ 258

IND vs ENG 5th T20I : ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో జోస్ బట్లర్ సెంచరీ, హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 257/3 భారీ స్కోరు చేసింది. భారత్ గెలవాలంటే 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. భారత బౌలింగ్, ఫీల్డింగ్ తీవ్రంగా నిరాశపరిచాయి.

IND vs ENG 5th T20I : టీమిండియా బౌలర్లను ఉతికేసిన బ్రూక్, బట్లర్.. టీమిండియా టార్గెట్ 258
Ind Vs Eng (1)
Rakesh
|

Updated on: Jul 11, 2026 | 9:27 PM

Share

IND vs ENG 5th T20I : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లకు ఇంగ్లీష్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో దండయాత్ర చేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని బట్లర్.. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపించారు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాన్ని తలకిందులు చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లు మొదటి నుంచే బౌండరీల వేట సాగించారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ప్రారంభంలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (6) వికెట్ పడగొట్టి ప్రసిద్ధ్ కృష్ణ మంచి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యాన్ష్ షెడ్గే అద్భుతంగా అందుకున్నాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో కలిసి జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే బట్లర్ కేవలం 51 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. అవుట్ అయ్యే సమయానికి బట్లర్ 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. మొత్తంగా తాను ఈ మ్యాచులో 95 పరుగులు సాధించి సెంచరీ మిస్ చేసుకున్నాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి కొంతవరకు కట్టడి చేయగలిగాడు. మిగిలిన బౌలర్లందరినీ ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తించారు. అక్షర్ పటేల్ వేసిన ఓ ఓవర్లో బ్రూక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులు రాబట్టగా.. సూర్యాన్ష్ షెడ్గే ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన శివమ్ దూబే ఓవర్ మ్యాచ్‌లోనే అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆ ఓవర్లో 6, 6, 4, W, W, 6 చొప్పున ఏకంగా 22 పరుగులు వచ్చాయి. కాకపోతే, ఇదే ఓవర్లో దూబే సెంచరీ హీరో జోస్ బట్లర్‌ను శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడమే కాకుండా.. ఆ తర్వాతి బంతికే జాకబ్ బెథెల్‌ను డకౌట్‌గా వెనక్కి పంపడం విశేషం.

ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ వైఫల్యాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో శివమ్ దూబే అత్యంత సులువైన క్యాచ్‌ను వదిలేసి హ్యారీ బ్రూక్‌కు లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యాన్ష్ షెడ్గే కూడా నేలపాలు చేశాడు. ఈ అందివచ్చిన అవకాశాలను వాడుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు చివరకు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలంటే టీమిండియా బ్యాటర్లు కూడా ఇదే రేంజ్‌లో భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us