AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : 1605 రోజుల నంబర్-1 సామ్రాజ్యం కూలిపోయే వేళ.. అయ్యర్ కెప్టెన్సీలో ఖాతా తెరిచేనా?

IND vs ENG : ఇంగ్లాండ్‌తో ఐదో టీ20లో టీమిండియాకు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ ఓడితే 1605 రోజులుగా కొనసాగుతున్న ఐసీసీ టీ20 నంబర్-1 ర్యాంక్ కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి విజయంపై అందరి దృష్టి నిలిచింది.

IND vs ENG  : 1605 రోజుల నంబర్-1 సామ్రాజ్యం కూలిపోయే వేళ.. అయ్యర్ కెప్టెన్సీలో ఖాతా తెరిచేనా?
Ind Vs Eng
Rakesh
|

Updated on: Jul 11, 2026 | 5:55 PM

Share

IND vs ENG : భారత క్రికెట్ ఫ్యాన్స్‎కు అత్యంత ఆందోళన కలిగించే వార్త ఇది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో గత 1605 రోజులుగా రారాజులా వెలుగుతున్న టీమిండియా సింహాసనం ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఈరోజు (జూలై 11, శనివారం) ఆతిథ్య జట్టుతో ఐదో మరియు చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఇప్పటికే 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ టీమిండియాకు కేవలం పరువు కాపాడుకునే మ్యాచ్ మాత్రమే కాదు.. తమ నంబర్-1 స్థానాన్ని కాపాడుకోవడానికి చావో రేవో లాంటి పోరాటం కానుంది.

ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోతే నంబర్-1 నుంచి అవుట్

ప్రస్తుత ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. భారత జట్టు మొదటి స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు రెండవ స్థానంలో ఉన్నాయి. అయితే, నేటి మ్యాచ్ గనుక ఇంగ్లాండ్ గెలిస్తే, పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. భారత్‌ను కిందకు నెట్టి ఇంగ్లాండ్ ప్రపంచ నంబర్-1 టీ20 జట్టుగా అవతరిస్తుంది. దాదాపు నాలుగేళ్లకు పైగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత జట్టు ర్యాంకింగ్స్ కిరీటం చేజారిపోకుండా ఉండాలంటే.. నేటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఖచ్చితంగా ఓడించాల్సిందే. ఈ ఏకైక మ్యాచ్ ఫలితం ఇరు జట్ల భవితవ్యాన్ని మార్చబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఖాతా తెరిచేనా?

భారత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఈ బ్రిటన్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఘోరంగా క్లీన్ స్వీప్ (2-0తో ఓటమి) అయ్యింది. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. కనీసం చివరి మ్యాచ్‌నైనా గెలిచి మరో ఘోరమైన క్లీన్ స్వీప్ పరాభవం నుండి తప్పించుకోవాలని జట్టు భావిస్తోంది. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ద్వయం తమపై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యంత కీలకం.

టీవీ, మొబైల్‌లో లైవ్ ఎక్కడ చూడాలంటే?

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ చారిత్రాత్మక ఐదో టీ20 పోరు సౌతాంప్టన్‌లోని ప్రసిద్ధ ది రోజ్ బౌల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడనుంది. ఈ రసవత్తర పోరును టీవీల్లో వీక్షించాలనుకునే వారు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే మొబైల్ వినియోగదారులు సోనీ లివ్ యాప్, జియోస్టార్‎లలో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us