AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCRA సవరణ బిల్లులో బిగ్ ట్విస్ట్..! అమిత్ షా ఇచ్చిన హామీ ఏంటి?

వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు–2026 (FCRA Amendment Bill)పై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ బిల్లును గత కాలానికి (రెట్రోస్పెక్టివ్‌గా) వర్తింపజేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా వెల్లడించారు. మిజోరం చర్చి నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

FCRA సవరణ బిల్లులో బిగ్ ట్విస్ట్..! అమిత్ షా ఇచ్చిన హామీ ఏంటి?
Fcra Amendment Bill,
Balaraju Goud
|

Updated on: Aug 07, 2026 | 9:06 AM

Share

వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు–2026 (FCRA Amendment Bill)పై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ బిల్లును గత కాలానికి (రెట్రోస్పెక్టివ్‌గా) వర్తింపజేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా వెల్లడించారు. మిజోరం చర్చి నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈ బిల్లును ఆగస్టు 12న పార్లమెంట్‌లో చర్చించి ఆమోదానికి తీసుకురానున్నట్లు హోంమంత్రి వెల్లడించినట్లు చెప్పారు.

ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు అయిన, గడువు ముగిసిన లేదా స్వచ్ఛందంగా వదులుకున్న సంస్థలకు చెందిన విదేశీ నిధులు, వాటితో కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికార సంస్థ ఆధీనంలోకి తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకురావాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

అయితే ఈ చట్టాన్ని గతానికి వర్తింపజేస్తే నిజాయితీగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా, మిజోరం కోహ్రాన్ హ్రుయితు కమిటీ (MKHC), మిజోరం చర్చిల మండలి (CCM) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పరిపాలనా లేదా సాంకేతిక లోపాల కారణంగా స్వచ్ఛంద సంస్థలు శిక్షార్హులుగా మారే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ చట్టాన్ని భావి కాలానికి మాత్రమే వర్తింపజేయాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన అమిత్ షా, బిల్లు గతానికి వర్తించదని హామీ ఇచ్చినట్లు లాల్దుహోమా తెలిపారు.

ఇదే సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుతో పాటు ఇతర చట్టాలపై చర్చ జరిగేలా ప్రతిపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఫోన్‌లో మాట్లాడి సహకారం కోరారు. గత పది రోజుల్లో పలుమార్లు ఇరు నేతల మధ్య చర్చలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ మాత్రం కీలక బిల్లులపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మరోవైపు 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కు పెంచే డీలిమిటేషన్ ప్రతిపాదనపైనా రాజకీయ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కీలక బిల్లులపై ఆగస్టు 12న జరిగే పార్లమెంట్ చర్చ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us