IND vs AFG : అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్ట్.. టీమిండియా నంబర్ 3 బ్యాటర్ ఎవరో కన్ఫర్మ్ చేసిన గంభీర్
IND vs AFG : యువ సంచలనం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్లో అఫ్గాన్ జట్టుతో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని, జట్టు ప్లేయింగ్ ఎలెవన్ కు సంబంధించిన కీలక అప్డేట్లను పంచుకున్నారు.

IND vs AFG : భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త టెస్ట్ మజా ఇచ్చేందుకు టీమిండియా సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 6) చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. యువ సంచలనం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్లో అఫ్గాన్ జట్టుతో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని, జట్టు ప్లేయింగ్ ఎలెవన్ కు సంబంధించిన కీలక అప్డేట్లను పంచుకున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జట్టులో చర్చనీయాంశంగా మారిన నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్పై ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు.
సాయి సుదర్శన్కే నంబర్ 3 స్థానం కన్ఫర్మ్
గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోతున్న యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్కు కోచ్ గౌతమ్ గంభీర్ బూస్ట్ ఇచ్చారు. రేపటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నంబర్ 3 పొజిషన్లోనే బ్యాటింగ్కు వస్తాడని గంభీర్ కన్ఫర్మ్ చేశారు. ఇంగ్లాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించని సాయి సుదర్శన్ స్థానంపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ గంభీర్ తన ప్రెస్ మీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. కేవలం నాలుగైదు మ్యాచ్ల ప్రదర్శనను బట్టి ఒక ఆటగాడిని జడ్జ్ చేస్తే బలమైన జట్టును నిర్మించలేమని, అందుకే సాయి సుదర్శన్కు లాంగ్ రన్ ఇస్తామని గంభీర్ గట్టిగా చెప్పారు.
ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సిరీస్లలో సాయి సుదర్శన్ ప్రదర్శన
ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాతే 24 ఏళ్ల సాయి సుదర్శన్ భారత టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన సాయి.. మొదటి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఆ సిరీస్లోని 6 ఇన్నింగ్స్లలో కేవలం 23.33 సగటుతో 140 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో రెండు డకౌట్లు, ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. స్థిరత్వం లేకపోవడంతో ఆ సిరీస్లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత వెస్టిండీస్పై ఒక ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసినా, సౌతాఫ్రికా పర్యటనలో 2 ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 29 పరుగులే చేయగలిగాడు. ఈ పేలవ రికార్డు ఉన్నప్పటికీ గంభీర్ అతని ప్రతిభను నమ్మి మరో అవకాశం ఇస్తున్నారు.
టీమిండియాలోకి కొత్త స్పిన్నర్ ఎంట్రీ ఖాయం
సాయి సుదర్శన్ విషయమే కాకుండా రేపటి మ్యాచ్లో కొత్తగా అరంగేట్రం చేయబోయే ఆటగాళ్ల గురించి కూడా గౌతమ్ గంభీర్ ఒక బిగ్ హింట్ ఇచ్చారు. ఐపీఎల్ 2026 లో తమ స్పిన్ మాయాజాలంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్లలో ఒకరు రేపు టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టడం ఖాయమని కోచ్ తెలిపారు. వీరిద్దరికీ ఒకే రకమైన స్కిల్స్ ఉన్నాయని, రాబోయే శ్రీలంక సిరీస్కు స్పిన్నర్లు చాలా అవసరమని గంభీర్ పేర్కొన్నారు. శ్రీలంక పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఈ ఇద్దరిలో ఒకరిని ఇక్కడే పరీక్షించాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో మరికొద్ది గంటల్లో టీమిండియా తరఫున ఎవరు అరంగేట్రం చేయబోతున్నారనే ఉత్కంఠ ఫ్యాన్స్లో నెలకొంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
