
Punjab Kings IPL Playoffs: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ముఖ్యంగా ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్పై వరుణుడి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఆకాశం దాదాపు 70 శాతం మేఘావృతమై ఉంటుందని, భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే లేదా పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మ్యాచ్కు ముందు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్లకు వర్షం అంతరాయం కలిగించడం గమనార్హం.
ప్రస్తుతం 11 మ్యాచ్లలో 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 3 మ్యాచ్లలో కనీసం రెండింటిలో గెలవాల్సి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. దీనివల్ల పంజాబ్ 14 పాయింట్లకు చేరుకున్నప్పటికీ, అగ్రస్థానంలో ఉన్న జట్లను అధిగమించే అవకాశం కోల్పోతుంది. ముఖ్యంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫైయర్ ఆడే అవకాశం పంజాబ్కు చేజారవచ్చు.
ఈ సీజన్ ఆరంభంలో అజేయంగా నిలిచిన పంజాబ్ కింగ్స్, గత నాలుగు మ్యాచ్లలో వరుసగా ఓటమి పాలవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇప్పటికే కోల్కతాలో జరిగిన ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం పంజాబ్కు ప్రతికూలంగా మారింది. ఇప్పుడు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉండటంతో, పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్ల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడం పంజాబ్కు సవాలుగా మారనుంది.
సొంత గడ్డపై జరగనున్న ఈ కీలక పోరులో విజయం సాధించి మళ్ళీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్న పంజాబ్ కింగ్స్ ఆశలు ఇప్పుడు వరుణుడి చేతుల్లో ఉన్నాయి. వాతావరణం అనుకూలించి మ్యాచ్ జరిగితేనే శ్రేయాస్ అయ్యర్ సేన తమ సత్తా చాటే అవకాశం ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..