AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: 17 ఫోర్లు, 2 సిక్సర్లు.. 5 గురి బౌలర్ల ఊచకోత.. 63 బంతుల్లో మ్యాచ్ ఖతం!

టార్గెట్ చిన్నది. ఆడుతూ.. పాడుతూ.. సునాయాసంగా కొట్టేయొచ్చు. కానీ ఈ ప్లేయర్స్ మాత్రం ఊచకోతకు దిగారు. ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీల..

IPL 2022: 17 ఫోర్లు, 2 సిక్సర్లు.. 5 గురి బౌలర్ల ఊచకోత.. 63 బంతుల్లో మ్యాచ్ ఖతం!
Delhi Capitals
Ravi Kiran
|

Updated on: Apr 21, 2022 | 6:22 PM

Share

టార్గెట్ చిన్నది. ఆడుతూ.. పాడుతూ.. సునాయాసంగా కొట్టేయొచ్చు. కానీ ఈ ప్లేయర్స్ మాత్రం ఊచకోతకు దిగారు. ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీల వర్షంతో విరుచుకుపడ్డారు. దెబ్బకు 63 బంతుల్లోనే నిర్దేశించిన టార్గెట్‌ను ఈజీగా బాదేశారు. నిన్న ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా దంచికొట్టారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీల మోత మోగించారు.

మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తొలుత పంజాబ్‌కు బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చింది. మొదటి రెండు ఓవర్లు మంచి శుభారంభం వచ్చినప్పటికీ.. ఆ తర్వాత నుంచి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది పంజాబ్. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వరుస వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ జితీష్ శర్మ(32) కొద్దిసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టించినప్పటికీ.. మిగిలిన వారెవరూ అతడికి సహకారం అందించకపోవడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లకు 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీశాడు.

ఇక 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు డేవిడ్ వార్నర్(60), పృథ్వీ షా(41) మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడి కేవలం 5 ఓవర్లలోనే 75 పరుగులు పూర్తి చేశారు. అలాగే మొదటి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫస్ట్ నుంచి బౌండరీల వర్షం కురిపించిన డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 10.3 ఓవర్లు అంటే 63 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించి ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. నెట్ రన్‌రేట్‌(+0.942)లో మాత్రం మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉంది. కాగా, ఢిల్లీ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది.