Video: ఎవర్రా మీరంతా.. బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. పీఎస్ఎల్లో షాకింగ్ సీన్..!
PSL 2026 Controversy: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదికగా క్రికెట్ అభిమానులు ఊహించని ఘటన చోటుచేసుకుంది. కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ మైదానంలోనే బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. గెలిచిన ఆనందంలో ఉండాల్సిన ఆటగాళ్లు ఇలా ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సోషల్ మీడియాలో వైరల్గా మారి, క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

PSL 2026 Controversy: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సీనియర్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మధ్య జరిగిన ఘర్షణ క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రావల్పిండి జట్టుపై కరాచీ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సాధారణంగా విజయం తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది.
వైరల్ వీడియోలో అసలేముంది?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల ప్రకారం, వార్నర్ చాలా ఆగ్రహంతో మొయిన్ అలీ వైపు దూసుకెళ్లడం కనిపిస్తుంది. వారిద్దరి మధ్య మాట మాట పెరిగి, అది తోపులాట వరకు వెళ్లేలా అనిపించింది. పరిస్థితి విషమిస్తుందని గమనించిన జట్టు డైరెక్టర్ హైదర్ అజహర్ తక్షణమే జోక్యం చేసుకున్నారు. ఆయన వార్నర్ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ పెద్దది కాకుండా నిలిచిపోయింది. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి ప్రవర్తన జట్టు క్రమశిక్షణపై ప్రశ్నలను లేవనెత్తింది.
వివరణ ఇచ్చిన డేవిడ్ వార్నర్..
🚨 Moeen Ali vs David Warner 🚨
Things got heated on the field as Moeen Ali and David Warner exchanged words and stepped towards each other 👀🔥
Team Director had to intervene to push Warner away.
— JB (@93Yorker) April 3, 2026
ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డేవిడ్ వార్నర్ స్పందించారు. తమ మధ్య ఎటువంటి గొడవ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసే విషయంలో తాము చర్చించుకున్నామని, దానిని ఎవరో తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. జట్టు యాజమాన్యం కూడా ఇది కేవలం సరదాగా జరిగిన సంభాషణే అని, ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని సమర్థించుకొచ్చింది. అయినప్పటికీ, వీడియోలో వారి ముఖ కవళికలు మాత్రం సీరియస్ చర్చ జరిగినట్లే కనిపిస్తున్నాయి.
వివాదాల నడుమ కరాచీ కింగ్స్ ఘనవిజయం..
మైదానం బయట ఎన్ని వివాదాలు నడిచినా, ఆటలో మాత్రం కరాచీ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. రావల్పిండి నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ సమర్థవంతంగా ఛేదించింది. కెప్టెన్ వార్నర్ బాధ్యతాయుతంగా ఆడి 50 పరుగులు చేయగా, మొయిన్ అలీ కూడా తన వంతు సహకారాన్ని అందించారు. ఈ విజయంతో పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకున్నప్పటికీ, ఈ తాజా వివాదం జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ప్రభావం చూపుతుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
