Vaibhav Sooryavanshi: నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇతడే.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సచిన్ టెండూల్కర్లా సుదీర్ఘకాలం దేశానికి సేవలందించే ఆటగాడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో వైభవ్ టెక్నిక్, ఫిట్నెస్, మానసిక బలంపై ప్రత్యేక శిక్షణ అందించనుంది. అతనితో పాటు 10-15 మంది యువ ప్రతిభావంతులను కూడా బోర్డు పర్యవేక్షిస్తోంది.

Vaibhav Sooryavanshi: భారతదేశ క్రికెట్లో సచిన్ టెండూల్కర్లా సుదీర్ఘకాలం సేవలు అందించే కొత్త లెజెండ్ను తయారుచేసేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ జరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ సహా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ భేటీకి హాజరయ్యారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మినహా మిగిలిన ప్రధాన దిగ్గజాలంతా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు, అతనికి అందించాల్సిన ట్రైనింగ్ పై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది.
సచిన్ లాంటి సుదీర్ఘ కెరీర్
సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైభవ్ సూర్యవంశీని బోర్డు చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ లేదా ఇతర దిగ్గజ ఆటగాళ్లలాగే వైభవ్ లేదా అతని లాంటి డైమండ్స్ దేశం కోసం ఎంతోకాలం ఆడాలన్నదే బోర్డు లక్ష్యమని చెప్పారు. కేవలం ఒకటి రెండు సిరీస్లు లేదా ఏడాది కాలం మెరిసి మాయమయ్యేలా కాకుండా, అతను సుదీర్ఘ కాలం రాణించేలా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో స్పెషల్ ట్రైనింగ్
వైభవ్ ఇంటర్నేషనల్ కెరీర్లోని ప్రతి అంశాన్ని బోర్డు నిశితంగా పరిశీలిస్తోంది. అతని టెక్నిక్, శారీరక దృఢత్వం, మానసిక బలాన్ని పెంపొందించే బాధ్యతలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్కు అప్పగించారు. స్వయంగా లక్ష్మణ్ ఆ కుర్రాడి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ను పర్యవేక్షిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలు సైతం వైభవ్ ఆటతీరుకు ఫిదా అవుతున్న నేపథ్యంలో, అతనిపై ఒత్తిడి పడకుండా బోర్డు ప్రత్యేక రక్షణ కవచంలా నిలవనుంది.
బోర్డు రాడార్లో 15 మంది యంగ్ స్టార్స్
కేవలం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే కాకుండా అతని వయసు ఉన్న మరో 10 నుంచి 15 మంది అత్యంత టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు బీసీసీఐ సెలక్ట్ చేసింది. ఈ గ్రూప్ మొత్తాన్ని లక్ష్మణ్ నాయకత్వంలోని బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తును బంగారు బాటలో నిలిపేందుకు బీసీసీఐ ఈ రకమైన దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తుండటం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
