AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Board: తిరుమల పవిత్రతకే ప్రాధాన్యత.. తిరుమల ప్రక్షాళన కొత్త పాలక మండలితో సాధ్యమయ్యేనా..!

24 మందితో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ రంగాలకు చెందిన ప్రముఖులకు బోర్డులో స్థానం కల్పించింది.

TTD Board: తిరుమల పవిత్రతకే ప్రాధాన్యత.. తిరుమల ప్రక్షాళన కొత్త పాలక మండలితో సాధ్యమయ్యేనా..!
Tirumala
Raju M P R
| Edited By: |

Updated on: Oct 31, 2024 | 5:26 PM

Share

తిరుమల తిరుపతి పాలక మండలి ఏర్పాటు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 24 మందితో ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సగం మంది సొంత రాష్ట్రానికి చెందిన వారైతే మిగతా సగం ఇతర రాష్ట్రాల సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. ఎంతోమంది ఆశావాహులు మరెంతో మంది ప్రముఖులు టీటీడీ బోర్డు కు పోటీ పడ్డా ఎట్టకేలకు బీఆర్ నాయుడు చైర్మన్‌గా కూటమి సర్కార్ తిరుమల పాలక మండలిని నియమించింది. ఎన్నో సవాళ్లు మరెన్నో సమస్యలను చాలెంజ్‌గా టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కాబోతోంది..!

తిరుమల తిరుపతి దేవస్థానం. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టాప్ ప్రియారిటిగా ఉన్న టీటీడీలో పాలన అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే లక్ష్యం. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇప్పుడు టీటీడీకి నియమించిన కొత్త పాలకమండలి ఏ రకమైన సవాళ్లను, సమస్యలను ఎదుర్కోబోతోంది అన్నది ఇప్పుడు చర్చ.

24 మందితో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ రంగాలకు చెందిన ప్రముఖులకు బోర్డులో స్థానం కల్పించింది. ఏపీ నుంచి చైర్మన్ తో పాటు 12 మంది, మరో 12 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన ఏపీ సర్కార్ బోర్డు సభ్యులుగా మహిళలకు కూడా పెద్ద పీట వేసింది. కూటమిలోని పక్షాలు, అంకితభావంతో పనిచేసిన నేతలకు ప్రియారిటి ఇచ్చిన సీఎం చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా నియమించారు.

టీటీడీ బోర్డులో జిల్లాకు మరింత ప్రాధాన్యం ఉంటుందని భావించిన కూటమి పార్టీల శ్రేణులు మిశ్రమ స్పందన కనిపిస్తుండగా ఆశావాహులకు మాత్రం టీటీడీ బోర్డు లో స్థానం దక్కకుండా పోయింది. చైర్మన్ తోపాటు చిత్తూరు తిరుపతికి చెందిన వారికి ముగ్గురికి స్థానం దక్కింది. అన్యూహంగా కుప్పం క్లస్టర్ ఇంచార్జ్ శాంతారామ్, మాజీ ఎంపీ పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం కల్పించారు. గత ఐదేళ్లలో టీటీడీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేసిన ఖర్చులు పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో కొత్త పాలకమండలి తీసుకునే నిర్ణయాలు మరింత కీలకం కానున్నాయి.

గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలకు పాల్పడిందంటూ ఇప్పటికే ఆరోపణలు చేసిన కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు తన ముందున్న లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా తిరుమలకే వెళ్లలేకపోయానన్న టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం అని తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం కల్పించడంతోపాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం కాబోతోంది.

కొత్త పాలక మండలికి సాధారణ భక్తులే ప్రియారిటిగా మారబోతోంది. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపై కొత్త పాలక మండలి దృష్టి సారించబోతుంది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలన్న ఆలోచన లో కొత్త పాలక మండలి భక్తులకు గంటలోపే దర్శనం జరిగేలా ఎలాంటి విధానం అమలు చేయాలో దానిపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. టైం స్లాట్ పద్ధతిని తీసుకురావడంతో పాటు త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అలాగే, వీఐపీ దర్శనాలు, వాళ్ళు ఇచ్చే సిఫారసు లెటర్ల తోపాటు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన కల్తీ నెయ్యి వ్యవహారం కొత్త పాలకమండలికి సవాళ్లుగా మారబోతున్నాయి.

మరోవైపు గత ప్రభుత్వంలోని బోర్డు తీసుకున్న నిర్ణయాలు, అందులో దాగి ఉన్న అక్రమాలను బయట పెట్టడంతో పాటు తిరిగి అలాంటి నిర్ణయాలకు తావు లేకుండా చేయడమే కొత్త పాలకమండలి ముందున్న లక్ష్యంగా ఉంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలకమండలిలోని సభ్యులే కొందరు కొత్త పాలకమండలి లోనూ ఉండడంతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పని ఇప్పుడు తేల్చే బాధ్యత ఎవరిదన్నది కూడా మరో చర్చగా మారే అవకాశం ఉంది. మరోవైపు టీటీడీ బడ్జెట్‌లో దాదాపు మొత్తం సొమ్ము ఇంజనీరింగ్ పనులకు కేటాయించడం, శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఇష్టరాజ్యంగా ఖర్చు పెట్టడం ఎవరి ప్రయోజనాలకు మేలు జరిగిందన్న విషయాన్ని కూడా కొత్త పాలక మండలి తేల్చాల్సి ఉంది. చూడాలి మరీ కొత్త పాలక మండలి ఏమేరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో..!

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us