హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అమర్నాథ్ యాత్ర ఇప్పటికే మొదలైంది. జూన్ 29వ తేదీన మొదలైన ఈ అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది గత రికార్డ్ లను బద్దలుకొట్టి సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోందని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం అమర్ నాథ్ యాత్ర మొదటి ఐదు రోజులలో దాదాపు 50,000 మంది యాత్రికులు మందిరానికి చేరుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డ్ ను చెరిపేస్తూ జూన్ 29న ప్రారంభమైనప్పటి నుంచి అంటే కేవలం ఐదు రోజుల్లోనే లక్ష మందికి పైగా భక్తులు ‘దర్శనం’ చేసుకున్నారని తెలిపారు. మరో బ్యాచ్ 5,696 మంది యాత్రికులు ఈరోజు (గురువారం) కాశ్మీర్కు బయలుదేరారని అధికారులు తెలిపారు.
అమరనాథ్ యాత్ర కోసం “5696 మంది యాత్రికుల బృందం గురువారం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్లలో లోయకు బయలుదేరింది. వీరిలో 2028 మంది యాత్రికులు తెల్లవారుజామున 3.13 గంటలకు 97 వాహనాలతో కూడిన ఎస్కార్టెడ్ కాన్వాయ్లో ఉత్తర కాశ్మీర్ లోని బల్తాల్ బేస్ క్యాంప్కు బయలుదేరగా, 3.668 మంది 122 వాహనాలతో కూడిన మరో ఎస్కార్టెడ్ కాన్వాయ్లో తెల్లవారుజామున 3.40 గంటలకు దక్షిణ కాశ్మీర్ నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంపుకు బయలుదేరారు.
అయితే ఉదయం తేలికపాటి వర్షం,, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు రెండు యాత్ర మార్గాల్లో వాతావరణం సాధారణంగా మేఘావృతమైన ఉంటుందని వాతావరణ శాఖ ( మెట్ ) అంచనా వేసింది.
అమర్నాథ్ యాత్రికులు యాత్ర చేయడానికి 48 కి.మీ పొడవైన సాంప్రదాయ పహల్గామ్ మార్గాన్ని లేదా తక్కువ 14 కి.మీ పొడవైన బాల్తాల్ మార్గంలో ప్రయనిస్తారు. పహల్గామ్ మార్గంలో ప్రయాణించేవారు అమర్నాథ్ గుహ మందిరానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. బాల్తాల్ మార్గంలో వెళ్లి మంచి శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అదే రోజు బేస్ క్యాంపుకు తిరిగి వస్తారు.
సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ మందిరంలో సహజంగా మంచు లింగం రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ లింగం చంద్రుని కళల ఆధారంగా పెరగడం క్షీణించడం జరుగుతుంది. ఈ మంచు లింగం నిర్మాణం శివుని పౌరాణిక శక్తులకు ప్రతీక అని భక్తులు నమ్మకం. ఈ సంవత్సరం దాదాపు 300 కి.మీ పొడవైన జమ్మూ-శ్రీనగర్ హైవే వెంబడి.. జంట యాత్రా మార్గాలు, రెండు బేస్ క్యాంపులు, యాత్ర జరిగే సమయంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు.. గుహ మందిరం వద్ద యాత్రను సాఫీగా జరిగేలా అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
124కి పైగా ‘లంగర్లు’ (కమ్యూనిటీ కిచెన్లు) రెండు మార్గాల్లో .. ట్రాన్సిట్ క్యాంపుల వద్ద, గుహ మందిరం దగ్గర ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సంవత్సరం యాత్రలో 7,000 మందికి పైగా ‘సేవాదార్లు’ (వాలంటీర్లు) యాత్రికులకు సేవ చేస్తున్నారు. రెండు మార్గాల్లో యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..