ఓవైపు భగభగ మండుతున్న ఎండలు.. మరోవైపు అగ్ని వలయంలో స్వామిజీ తపస్సు.. ఏకంగా 15 రోజులు

ఏసీలో కూర్చుని పని చేస్తున్నా అబ్బా ఏంటి ఈ ఎండలు అనుకునే పరిస్థితులున్నాయి. దేశం మొత్తం ఎండలకు అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ వ్యక్తి ఎందుకు ఎర్రటి ఎండలో కూర్చున్నాడు.. వేడిని లెక్క చేయకుండా సాంఫాడాలో ఉన్న మాధవ గోసంవర్ధన్ గోశాలలో మండుతున్న ఎండలో భగ్గుమంటున్న అగ్ని ధుని మధ్య కూర్చుని ప్రతిరోజు 8 గంటల పాటు తపస్సు చేస్తున్నాడు

ఓవైపు భగభగ మండుతున్న ఎండలు.. మరోవైపు అగ్ని వలయంలో స్వామిజీ తపస్సు.. ఏకంగా 15 రోజులు
Swami's Fiery Tapasya

Edited By: Surya Kala

Updated on: May 20, 2025 | 1:26 PM

అసలే ఒకవైపు భరించలేని ఎండలు.. ఈ వేసవి తాపానికి ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఇక కాసేపు కరెంట్ పోయిందంటే ఉక్కపోత భరించలేక అంతే సంగతులు. ఇలాంటి సమయంలో కూడా ఓ వ్యక్తి ఎర్రటి ఎండలో.. అది కూడా చుట్టూ అగ్ని వలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 8 గంటల పాటు తపస్సు చేసుకుంటున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..! దాని గురించే మనం తెలుసుకుందాం..

నాలుగు వైపులా ఆవు ఎర్రలు (కండెలు)తో తయారైన అగ్ని వలయం.. చుట్టూ రగులుతున్న వేడి మధ్య కాషాయ వస్త్రాలు ధరించిన ఓ స్వామిజీ అకుంఠిత దీక్షతో తపస్సుకు కూర్చున్నాడు. పథ్మేడా సిద్ధ పీఠం తపోవన్ ధామ్లోని స్వాస్తిక్ మహారాజ్ అతని పేరు.. మరి ఇలా ఎందుకు తపస్సు చేస్తున్నాడనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ ప్రాంత శ్రేయస్సు కోసమే తన ఈ దీక్ష అని చెప్పుకొచ్చాడు. అది కూడా ఒక గంటో.. ఒక రోజో కాదు.. ఏకంగా 15 రోజుల పాటు ఇలాగే మండుతున్న అగ్ని మధ్య కఠిన తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు.

సాంఫాడాలో ఉన్న మాధవ గోసంవర్ధన్ గోశాలలో మండుతున్న ఎండలో ప్రతిరోజు 8 గంటల పాటు తపస్సు చేస్తున్నాడు. ఉదయం 9 గంటలకు తపస్సు ప్రారంభించి.. సాయంత్రం 5 గంటల వరకు ఈ తపస్సును కొనసాగిస్తున్నాడు. ఈ తపస్సు 15 రోజులపాటు ఇలాగే కొనసాగుతుందని, మే 21న ముగింపు ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా 8 గంటల తపస్సు అనంతరం స్వాస్తిక్ మహారాజ్ ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రవచనం కూడా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. ఇంకో విస్తుపోయే నిజాలు తెలిశాయి. తపస్వి స్వాస్తిక్ మహారాజ్ ఇలా తపస్సు చేయడం మొదటిసారేం కాదు. గతేడాది కూడా ఇదే విధంగా అగ్ని తపస్సు చేశారట. ఇంతకు ముందు కూడా ఇదే గోశాలలో తపస్సు చేశారు. అగ్ని తపస్సు మాత్రమే కాకుండా కృష్ణా నదిలో కూడా వరుసగా 15 రోజుల పాటు జల సాధన చేశారు. ప్రస్తుతం మహారాజ్ చేస్తున్న తపస్సు విషయం ఆ ప్రాంతమంతా విస్తృతంగా వ్యాపించడంతో స్వామీజీని దర్శించుకోవడానికి గోశాలకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దర్శనాల నిమిత్తం ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపిస్తోంది.. అలాగే సాయంత్రం పూట జరిగే ప్రవచనాలకు హాజరవుతున్నారు.

ఎక్కువగా సాంఫాడా, జాలోర్, కేశవన, మాండవల, బిషన్‌గఢ్, ఉమ్మేదాబాద్, డాంగ్రా, సాయిలా నుంచి భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. భగభగమండే మండే ఎండల్లో చుట్టూ పేర్చుకున్న అగ్ని వలయంలో చేస్తున్న ఘోర తపస్సుపై స్వాస్తిక్ మహారాజ్‌ను అడిగితే.. ఈ తపస్సు తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నానని బదులిచ్చారు. గతేడాది కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో తపస్సు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. తాను చేస్తున్న ఈ తపస్సు ద్వారా భగవంతుడిని ప్రార్థిస్తూ స్థానిక ప్రాంతాలకు అంతా మంచే జరగాలని, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా.. ఎక్కడ చూసినా స్వార్థం నిండిపోయిన ఈ ప్రపంచంలో తన కోసం కాకుండా ప్రజల కోసం ఇలా చేస్తుండడం గొప్ప విషయమే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..