AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట అధికారం మాదే.. 2026 ఎన్నికల కోసం అమిత్ షా పద్మవ్యూహం..

ఆరెండు రాష్ట్రాల్లో విజయం మాదే అంటున్నారు కేంద్రహోంమంత్రి అమిత్‌షా. 2026లో ఇన్నాళ్లూ సాధ్యంకాని ఫీట్‌ను సాధించాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అమిత్‌షా మాటల్లో దూకుడు కనిపిస్తోందీ. గెలుపుపై ధీమా వ్యక్తమవుతోంది. ఇంతకూ దశాబ్దాలుగా సాధ్యంకానిది వచ్చే ఏడాది ఎలా సాధించాలని కమలంపార్టీ కసరత్తు చేస్తోంది..అమిత్‌షా మాటల వెనుక ఉన్న ధైర్యం ఏమిటి..?

తమిళనాట అధికారం మాదే.. 2026 ఎన్నికల కోసం అమిత్ షా పద్మవ్యూహం..
Amit Shah
Venkata Chari
|

Updated on: Jun 09, 2025 | 9:54 PM

Share

ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల విజయాలతో ఉత్సాహంగా ఉన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో కూడా ప్రత్యర్థులను ఓడించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘తమిళనాడులో బీజేపీ-ఏఐడీఎంకే కూటమి అధికారంలోకి రాబోతోంది. నేను ఢిల్లీలో ఉన్నా..నా చెవులెప్పుడూ తమిళనాడులోనే ఉంటాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెబుతున్నారు..అమిత్‌షా ఎప్పటికీ డీఎంకేను ఓడించలేడని. అదీ నిజమే. ఓడించేది నేను కాదు.. తమిళనాడు ప్రజలు ఓడిస్తారు’.. ఇది అమిత్‌షా మాట. ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలిసినవాడిగా చెబుతున్నానంటూ అమిత్‌షా చెప్పడం వెనుక వ్యూహం ఏంటి.. అన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడులో ఏఐడీఎంకేతో అలయన్స్‌లో ఉంది బీజేపీ. తమిళనాడు అంటే.. ద్రవిడ పార్టీలు తప్ప మరో పార్టీ అక్కడ గెలిచిన చరిత్రలేదు. కానీ, అమిత్‌షా మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 2026లో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా అన్న డిస్కషన్ మొదలైంది.

తమిళనాడులో బీజేపీ స్థానిక సమస్యలపై దృష్టి సారించి, క్షేత్రస్థాయిలోసైలెంట్‌గా తనపని తాను చేసుకుపోతోంది. మదురై, కోయంబత్తూర్, చెన్నైలో కార్యకర్తల సమావేశాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తోంది. డీఎంకే ప్రభుత్వంపై అవినీతి, మహిళలపై నేరాలు, చట్టవ్యవస్థ వైఫల్యం ఆరోపణలను ప్రచార అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. స్థానిక నాయకులైన అన్నామలై, నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తులను విస్తరించేందుకు పీఎంకే, డీఎండీకే వంటి స్థానిక పార్టీలతో చర్చలు జరుపుతోంది. అమిత్ షా రెండు నెలల్లో రెండుసార్లు తమిళనాడు సందర్శించి, విద్యలో తమిళ భాష ప్రాధాన్యతను హైలెట్‌ చేస్తూ వస్తున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అమిత్‌షా. తమిళనాడులో ఎన్డీఏ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఏఐఏడీఎంకేతో పొత్తు విఫలమైనప్పటికీ, మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీ ప్లాన్‌లతో ముందుకు వెళ్తోంది. కూటమి అధికారంలోకి వస్తే.. పళనిస్వామికే సీఎం పీఠం దక్కుతుందని అమిత్‌షా ఇదివరకే ప్రకటించారు. అలాగే చిన్న పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. స్థానిక సమస్యలైన నీటి కొరత, ఉపాధి, విద్యను ప్రచారంలో ముందుంచుతోంది.

ఇక పశ్చిమబెంగాల్‌లో బీజేపీ టీఎంసీ ప్రభుత్వంపై దూకుడు వ్యూహం అనుసరిస్తోంది. కోల్‌కతా, హౌరా, దుర్గాపూర్‌లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. టీఎంసీ సర్కారు హయాంలో జరుగుతున్న హింస, అవినీతిని ఎత్తిచూపుతూ, ఓటర్లలో అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. సువేందు అధికారి, దిలీప్ ఘోష్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలిచినప్పటికీ, టీఎంసీ హింస కారణంగా కార్యకర్తలు బాధపడ్డారని షా ఆరోపించారు. ఈసారి స్థానిక నాయకులను ముందుంచి, మత విద్వేషాలను ఎదుర్కొనే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు రామమందిరం, జాతీయవాద భావజాలాన్ని ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. అలాగే టీఎంసీయేతర పార్టీలతోనూ పొత్తు అవకాశాలు పరిశీలిస్తూ, అధికార పార్టీ ఓటు బ్యాంకును చీల్చే వ్యూహం అనుసరిస్తోంది.

బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. తమిళనాడులో 60వేల బూత్ కమిటీలను, పశ్చిమబెంగాల్‌లో 8వేల బూత్ కమిటీలను ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. యువ కార్యకర్తలను శిక్షణ ఇస్తూ, సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని తీవ్రతరం చేస్తోంది. అమిత్ షా స్వయంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో సమన్వయం పెంచుతున్నారు. రాష్ట్రాల్లోని అసంతృప్త ఓటర్లను గుర్తించి, వారి సమస్యలను ప్రచారంలో ఎత్తిచూపే వ్యూహం అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో స్థానిక నాయకులకు స్వయంప్రతిపత్తి ఇవ్వడం ద్వారా పార్టీ బలం పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మరి అమిత్‌షా వ్యూహాలు తమిళనాడు, వెస్ట్‌బెంగాల్‌లో విజయాలను నమోదు చేస్తాయా అన్నది చూడాలి.

మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us