కడుపు మండింది…నామినేషన్లు వేశారు
నిజామాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క, నకిలీ విత్తనాల బారిన పడి, విపత్తుల కడగండ్లతో, ఆదుకుంటామని హామి ఇచ్చిన నాయకుల మోసాలతో విసిగిపోయిన రైతలు ఈ సారి నిరసనగా వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఎప్పుడూ ఉరితాడునో, చేనులో బావినో నమ్ముకునే రైతన్నలు….ఈ సారి సామాన్యులుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. నేటితో లోక్సభ స్థానానికి నామినేషన్ల పర్వం ముగిసింది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒకే రోజు 173 నామినేషన్లు వేశారు. […]
నిజామాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క, నకిలీ విత్తనాల బారిన పడి, విపత్తుల కడగండ్లతో, ఆదుకుంటామని హామి ఇచ్చిన నాయకుల మోసాలతో విసిగిపోయిన రైతలు ఈ సారి నిరసనగా వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఎప్పుడూ ఉరితాడునో, చేనులో బావినో నమ్ముకునే రైతన్నలు….ఈ సారి సామాన్యులుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. నేటితో లోక్సభ స్థానానికి నామినేషన్ల పర్వం ముగిసింది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒకే రోజు 173 నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేసినవారిలో 230 మంది రైతులు ఉన్నారు. పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా రైతులు నామినేషన్ల రూపంలో గతకొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
పసుపు, ఎర్రజొన్న, చెఱకు పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ చెరకు రైతులు సైతం నిరసన బాట పట్టారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న ప్రభుత్వం, నేతలు కనీసం పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై సుదీర్ఘపోరాటం చేస్తున్న రైతులు… ఎన్నికలను కూడా తమ పోరాటానికి వేదికగా చేసుకున్నారు. తొలిదశ ఎన్నికలకు దేశంలోనే అత్యధిక నామినేషన్లు నిజామాబాద్లో దాఖలు కావడంతో ఇక్కడ బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం ఇచ్చింది.