నిద్రలో గుండెపై పిశాచి దూకినట్లు ఎందుకు అనిపిస్తుంది?
నిద్ర పక్షవాతం అంటే నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే శరీరం కదలకుండా స్థంభించిపోవడం. దీనితో పాటు భయం, ఆందోళన, భ్రమలు కలుగుతాయి. ఇది సాధారణంగా REM నిద్ర దశలో మెదడు, శరీరం మధ్య సమన్వయం లోపించడం వల్ల వస్తుంది. అవగాహన, ఒత్తిడి తగ్గించడం వంటివి దీనికి ఉత్తమ పరిష్కారాలు.

మనలో కొందరు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటారు. కాళ్లు, చేతులు ఆడవు. ఏం జరిగిందో, ఏం జరగబోతోందో అర్థం కాదు. అంతా అయోమయంగా అనిపిస్తుంది. ఏదో జరుగుతోందని భయమేస్తుంది. నిద్ర లేచిన వెంటనే కొంతమందికి కాసేపటివరకు శరీర భాగాలు కదలవు. ఈ పరిస్థితినే నిద్ర పక్షవాతం లేదా స్లీప్ పెరాలసిస్ అంటారు. మెదడు పనిచేస్తూనే ఉన్నా, శరీరం స్పందించదు. ఈ పరిస్థితుల్లో గ్రహాంతరవాసులను, దెయ్యాలను, చొరబాటుదారులను, చనిపోయిన బంధువులను చూస్తున్నామని, శరీర భాగాలు గాలిలో తేలుతున్నట్లు లేదా తమని పోలిన వారు మంచం పక్కన నిలబడినట్లు కూడా కొందరు భ్రమపడతారు. రాత్రిపూట మన నిద్రలో నాలుగు దశలు ఉంటాయి. చివరి దశను రాపిడ్ ఐ మూవ్మెంట్ (REM) స్లీప్ అంటారు. మనకు కలలు వచ్చేది ఈ దశలోనే. ఈ దశలో మెదడు మన శరీరాన్ని స్థంభింపజేస్తుంది. మనకు కలలో వచ్చే వాటి వల్ల గాయాల పాలు అవ్వకుండా మెదడు తీసుకునే ముందుజాగ్రత్త చర్యగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు మెదడు REM స్థితి నుంచి ముందుగానే తేరుకుంటుంది. ఈ ప్రక్రియ మనల్ని నిద్ర నుంచి మేల్కొనేటట్టు చేస్తుంది. అయితే, మెదడులోని కింది భాగం అప్పటికి REM స్థితిలోనే ఉంటూ, శరీరం స్థంభించిపోవడానికి అవసరమైన న్యూరో ట్రాన్స్మిటర్లను పంపిస్తూనే ఉంటుంది. అప్పుడు మెదడులోని కొన్ని భాగాలు యాక్టివ్ అవుతాయి. అంటే మీ మెదడు పనిచేస్తుంది కానీ, శారీరకంగా మీరు కదలలేని స్థితిలో ఉంటారని నిద్ర మీద పరిశోధన చేస్తున్న నిపుణులు వివరించారు.
ఈ పరిస్థితి ఉన్నవారిలో అత్యధిక శాతం మందికి ఇదొక చిన్న, విచిత్రమైన అనుభూతిగా మాత్రమే అనిపిస్తుందని వెల్లడిస్తున్నారు. ఒక రకంగా ఇది నిద్రలో నడక లాంటిది. నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారిలో అత్యధిక శాతం మంది, ఇదో పెద్ద వ్యాధి అని, వైద్యులను కలవాలని అనుకోరని కొలిన్ చెప్పారు. అయితే, ఆ కొంతమందికి ఇది బాగా ఇబ్బంది పెట్టే విషయం. నిద్ర పక్షవాతం ఉన్నవారిలో 15% నుంచి 44% మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని ఒక పరిశోధనలో తేలింది. నిద్రలేమి నుంచి ఈ నిద్ర పక్షవాతం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే సరిగా నిద్ర లేనప్పుడు, నిద్రకు సంబంధించిన ప్రక్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. ఈ నిద్ర పక్షవాతానికి ఉత్తమమైన వైద్యం అవగాహన కల్పించడమే. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటో రోగులకు చెప్పి, దీనివల్ల ప్రమాదం ఏమీ లేదని చెప్పి భరోసా వారికి ఇవ్వాలి. కొన్నిసార్లు ధ్యానం, థెరపీ లాంటివి సూచిస్తారు. నిద్రపోయే ముందు ఆందోళన తగ్గించి, శరీరం స్థంభించినప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండగలిగేలా చేయటం ఈ ప్రక్రియ లక్ష్యం. పరిస్థితి తీవ్రంగా ఉంటే మందులు వాడాలని సూచిస్తారు. అతీత శక్తులు ఉన్నాయని నమ్మి భయపడే వారికి నిద్ర పక్షవాతం అంటే ఎక్కువ భయం ఉంటుందని, అలాగే ఈ భయం నిద్ర పక్షవాతం తరచూ రావడానికి కూడా కారణం అవుతుందని నిపుణులు చెప్పారు. ఆందోళనకు, ఒత్తిడికి గురయ్యే వారిలో నిద్ర వ్యవస్థ దెబ్బతింటుందని, దాంతో నిద్ర పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని బలంద్ జలాల్ తెలిపారు.
