పల్నాడులో పొలిటికల్ హీట్..

పునరావాస శిబిరాలు.. ఈ మాట తరచూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధుల కోసం ఏర్పాటు చేస్తున్నాయనే విషయం చాలా వింతగానూ, కొత్తగానూ అనిపించవచ్చు. ఏపీలో గుంటూరు జిల్లా పల్నాడులో ప్రతిపక్ష టీడీపీ ఈ విధమైన పునరావాస కేంద్రాల ఏర్పాటుకు తెరతీసింది.  అసలు విషయంలోకి వెళితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని, ఈ దాడుల్లో […]

పల్నాడులో  పొలిటికల్ హీట్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 07, 2019 | 5:01 PM

పునరావాస శిబిరాలు.. ఈ మాట తరచూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధుల కోసం ఏర్పాటు చేస్తున్నాయనే విషయం చాలా వింతగానూ, కొత్తగానూ అనిపించవచ్చు. ఏపీలో గుంటూరు జిల్లా పల్నాడులో ప్రతిపక్ష టీడీపీ ఈ విధమైన పునరావాస కేంద్రాల ఏర్పాటుకు తెరతీసింది.  అసలు విషయంలోకి వెళితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని, ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు సైతం కోల్పోయారంటూ ఆరోపిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ కూడా తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పాశవికమైన దాడులు చేస్తున్నారంటూ ఆపార్టీ నేతలు వైసీపీపై ఆరోపణలు చేస్తోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దారుణాలకు పాల్పడుతోందని, దీంతో పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే వైసీపీ క్యాడర్ చేసిన దాడులల్లో తమ పార్టీకి చెందిన ఎంతో మంది  కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్టు టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ దాడుల్లో గాయపడి, కనీసం గ్రామాల్లోకి కూడా వెళ్లలేని వారి కోసం మానవతా దృక్ఫధంతో టీడీపీ గుంటూరులో పునరావాస శిబిరాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొంతమంది బాధితులు ఈ శిబిరాల్లో చేరారు. ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అనుచరులు తమపై దాడులకు తెగబడుతున్నారని , తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు పునరావాస శిబిరాల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి దగ్గరుండి మరీ గ్రామానికి చేర్చారు. బాధితులకు తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే.. అధికార వైసీపీ కూడా ఆయా గ్రామాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినవారిని, అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కాలంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వైసీపీ కార్యకర్తల కోసం ఈ శిబిరాన్ని పిడుగురాళ్లలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈశిబిరం నడుస్తోంది.

పల్నాడు ప్రాంతంలో గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా రాద్ధాంతం చేసి రాజకీయంగా లబ్దిపొందాలని టీడీపీ భావిస్తోందని విమర్శించారు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే తనకు ఆశ్చర్యం కలుగుతుందని, ఇక్కడ ఏదో జరిగిపోతుందనే విధంగా చంద్రబాబు దుష్ప్రచారానికి  తెరతీశారంటూ ఆరోపించారు. గ్రామాలను విడిచి జనం తరలిపోతున్నారని, అవసరమైతే తనమీద దాడులు చేయాలని చంద్రబాబు అనడం చూస్తుంటే వింతగా ఉందంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలంతా తరిమికొట్టిన సంగతి చందబ్రాబు మర్చిపోయారేమో అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ కార్యకర్తల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి లోకేశ్. రాష్ట్రంలో వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజలపై దాడులు చేస్తున్నారంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కీలకంగా మారారు. ఆయన అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వడిచిపెట్టింది. అయితే ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. యరపతినేని ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత కావడంతో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తే అది కక్షసాధింపుగా భావించే అవకాశమున్నందున.. సీబీఐని వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీడీపీ నేత యరపతినేనిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంతోనే  ప్రతిపక్ష టీడీపీ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది.

మొత్తానికి గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయ పార్టీల పునరావాసాలతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ గొడవలు ఏ రూపు సంతరించుకుంటాయో చూడాల్సి ఉంది.