హస్తం పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. కదులుతున్న కాంగ్రెస్ పునాదులు.. ఈ దుస్థితికి కారణాలేంటి?

|

Sep 18, 2021 | 6:58 PM

Congress Party: 135  ఏళ్లకు పైబడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. అయితే ఇప్పుడు ఆ పార్టీ కాలం కలిసిరాక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మిగిలింది మూడు రాష్ట్రాలు మాత్రమే..

హస్తం పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. కదులుతున్న కాంగ్రెస్ పునాదులు.. ఈ దుస్థితికి కారణాలేంటి?
Sonia Gandhi, Rahul Gandhi (File Photo)
Follow us on

Big Jolt For Congress Party: 135  ఏళ్లకు పైబడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. అయితే గత కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. దెబ్బ మీద దెబ్బ తగులుతూ  ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మిగిలింది మూడు రాష్ట్రాలు మాత్రమే.. అయినప్పటికి చేజేతులా అధికారాన్ని పోగొట్టుకుంటోంది ఆ పార్టీ. అంతర్గత కలహాలు పంజాబ్‌ సీఎం అమరీందర్ రాజీనామాకు దారితీశాయి. దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినప్పటి ఆ మూడు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం హస్తం పార్టీకి చేతకావడం లేదు. నేతల మధ్య ఆధిపత్య పోరు , అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది కాంగ్రెస్‌. పంజాబ్‌కు మాత్రమే ఇది పరిమితం కాలేదు. రాజస్థాన్‌ , చత్తీస్‌ఘడ్‌లో కూడా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగానే పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను కాదని సిద్ధూను వెనకేసుకొస్తున్న హైకమాండ్‌ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రేపోమాపో సొంత కుంపటి పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌ , కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల నుంచి కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికి కూడా గుణపాఠం నేర్చుకోలేదు. అంతర్గత విభేదాల కారణంగానే మధ్యప్రదేశ్‌ , కర్నాటకలో చేజేతులా అధికారాన్ని పోగోట్టుకున్నారు కాంగ్రెస్‌ నేతలు. పంజాబ్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ , సిద్దూ వర్గాల మధ్య ఆధిపత్య పోరు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి దారితీయవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. పంజాబ్‌ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పంజాబ్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది ఆప్‌.

మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మహారాష్ట్ర , జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్‌ పరిస్థితి గొప్పగా ఏం లేదు. అక్కడ కూడా పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. వరుస ఓటమిల నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌ గుణపాఠం నేర్చుకోలేదు. అధికారంలో ఉన్న అతి తక్కువ రాష్ట్రాల్లో కూడా అసంతృప్తులను కంట్రోల్‌ చేసే విషయంలో అధిష్టానం విఫలమయ్యింది. పార్టీలో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్నా పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతోంది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చినప్పటికి కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. జ్యోతిరాధిత్యా సింధియా తన వర్గంతో బీజేపీలోకి జంప్‌ కావడంతో అక్కడ కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలింది. తిరిగి బీజేపీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల సీట్లలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. పంజాబ్‌లో అమరీందర్‌ వర్సెస్‌ సిద్దూ , రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వర్సెస్‌ సచిన్‌ పైలెట్‌ , చత్తీస్‌ఘడ్‌లో సీఎం భూపేష్‌ బాగెల్‌ వర్సెస్‌ టీఎస్‌ సింగ్‌దేవ్‌ జోరుగా నడుస్తోంది.

మధ్యప్రదేశ్‌ సీన్‌ రాజస్థాన్‌లో కూడా రిపీట్‌ అవుతుందని భయపడ్డారు. కాని రాహుల్‌,ప్రియాంక జోక్యం చేసుకోవడంతో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం తాత్కాలికంగా గట్టెక్కింది. కాని తన వర్గానికి మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదని కస్సుబుస్సు లాడుతున్నారు సచిన్‌ పైలెట్‌ . చత్తీస్‌ఘడ్‌లో రెండున్నర ఏళ్ల పాటు సీఎం పదవి డీల్‌ ఏమయ్యిందని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు రాష్ట్ర మంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్‌. ఇలా కాంగ్రెస్‌ పార్టీ హైకమండ్‌ ముచ్చటగా అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది.

Also Read..

హౌజ్‌లో తప్పిన ఆర్డర్‌ను సెట్‌ చేద్దామంటోన్న నాగ్‌.. చెర్రీ స్పెషల్‌ ఎంట్రీ అందుకేనా?

టీటీడీ జంబో బోర్డు వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆయన పేరును సిఫార్సు చేయలేదంటూ కిషన్ రెడ్డి లేఖ