ఎండు చేపలు ఇష్టంగా తింటున్నారా..? అయితే, తప్పక ఈ విషయాలు తెలుసుకోండి..
చాలామందికి ఎండు చేపలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే, కొందరు ఎండు చేపల వాసన వస్తేనే ఆమడ దూరం పారిపోతుంటారు. పచ్చి చేపలను తినేవారు కూడా చాలా మంది ఎండు చేపలు తినటానికి ఇష్టపడరు. కానీ, ఎండు చేపలను తినే వాళ్ళు మాత్రం వాటిని చాలా ఇష్టంగా తింటారు. వాటి రుచి తింటేనే తెలుస్తుంది అని చెబుతుంటారు. ఇంతకీ ఎండు చేపలు అందరికీ ఒకేలా పనిచేస్తాయా..? అంటే కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎండు చేపలు కొందరిలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాంటి వారు ఎండు చేపలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎవరు ఎండు చేపలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 10, 2025 | 9:02 AM

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎండుచేపలు తినడం మంచిది కాదు. ఎండు చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది. వీటిలోని సోడియం రక్తపోటును మరింత పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది కిడ్నీల వడబోత సామర్థ్యంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. అందుకే ఎండుచేపలు వీరు తినకూడదు.

షుగర్ సమస్యతో బాధపడేవారు కూడా ఎండుచేపలకు దూరంగా ఉండటమే మంచిది. ఇవి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు ఎండుచేపలు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని కొవ్వులు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఎండుచేపలు తినడం మంచిది కాదు. ఇవి ఈ సమస్యను మరింత పెంచుతాయి. ఎండుచేపలు తింటే కొందరికి ఎలర్జీ కలుగుతుంది. అందుకే తరచూ దద్దుర్లు, దురద, ర్యాషెస్ వంటి సమస్య ఉన్నవారు ఈ ఎండుచేపలు తినకపోవడమే మంచిది.

సైనస్, ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండుచేపలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లలు ఎండు చేపలు తినడం మంచిది కాదు. ఇవి వీరిలో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అందుకే వీరికి ఎండుచేపలు దూరంగా ఉంచుతాయి.

ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదని చెబుతున్నారు. అల్సర్ సమస్య ఉన్నవారు కూడా ఎండుచేపలు తినడం మంచిది కాదు. ఇవి అల్సర్ సమస్యను మరింత పెంచుతాయి.




