BSNL WiFi: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
BSNL: ఫైబర్ కనెక్టివిటీ కోసం దేవస్వోమ్ బోర్డు, పోలీసు, అటవీ, ఆరోగ్య శాఖలు, బ్యాంకులు, న్యూస్ మీడియా, ఇతర ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంస్థలు ఇక్కడ టెలికాం సేవలను ఏర్పాటు చేశాయి..
Updated on: Nov 23, 2024 | 2:38 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ధరలు పెంచిన తర్వాత వాటి వినియోగదారులంతా బీఎస్ఎన్ఎల్ బాట పట్టారు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్లో ఎలాంటి ధరలు పెంచలేదు. చౌకైన ప్లాన్స్ను తీసుకువస్తోంది.

ఇప్పుడు 4జీ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాలాధరణ కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఇదే సీజన్లో లక్షలాది మంది అయ్యప్ప స్వాములు శబరిమలను దర్శించుకుంటారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు నెట్వర్క్ను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈసారి బీఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్ చేసింది.

ఇందుకోసం శబరిమలలోని 48 ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ వై-ఫై కనెక్షన్లను ఏర్పాటు చేసింది. BSNL చేసిన ఈ ప్రయత్నం శబరిమలలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సేవలను హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మరింత సమన్వయం చేస్తుంది.

BSNL శబరిమల, పంపా, నిలక్కల్ వద్ద పబ్లిక్ Wi-Fi సేవలను అందిస్తుంది. తిరువనంతపురం దేవస్వం బోర్డ్ సహకారంతో నెట్వర్క్ విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలో 4G టవర్లను కూడా సిద్ధం చేసింది. దీంతో పాటు పంపా, శబరిమల వద్ద యాత్రికులను స్వీకరించేందుకు, వారి అవసరాలను తీర్చేందుకు 24 గంటలపాటు పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

శబరిమల సందర్శించే అయ్యప్ప భక్తులు శబరిమల, నిలక్కల్, పంపాలో BSNL Wi-Fi సేవలను పొందవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్లోని వై-ఫై ఆప్షన్ను ఆన్ చేయండి. దీని తర్వాత స్క్రీన్పై కనిపించే BSNL వైఫై నెట్వర్క్ ఎంపికను ఎంచుకోండి. తర్వాత ఓపెన్ అయిన వెబ్ పేజీలో మీ 10 అంకెల మొబైల్ నంబర్ని టైప్ చేసి, గెట్ పిన్పై క్లిక్ చేయండి. ఫోన్లో SMSగా స్వీకరించిన 6-అంకెల పిన్ నంబర్ను సమర్పించడం ద్వారా తక్షణమే BSNL Wi-Fiని పొందవచ్చు.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కొన్ని నెలల్లో మిలియన్ల కొద్దీ Jio, Airtel, Vi కస్టమర్లను చేర్చుకుంది. ఇప్పుడు ప్రయివేట్ కంపెనీలకు కొత్త టెన్షన్ క్రియేట్ చేసింది బీఎస్ఎన్ఎల్.




