Basha Shek |
Updated on: Mar 24, 2022 | 7:10 AM
దక్షిణాఫ్రికా పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాలో ఇరు జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో చివరిదైన మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్లు ఆతిథ్య జట్టును చిత్తు చేశారు. సెంచూరియన్లో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 154 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 5 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు.
బంగ్లాదేశ్కు చెందిన 26 ఏళ్ల పేసర్ తస్కిన్ అహ్మద్ రెండు రోజుల క్రితం ఐపీఎల్ 2022లో ఆడేందుకు అవకాశం వచ్చింది. గాయపడిన బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇతడిని తీసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుమతించలేదు.
కాగా సెంచూరియన్ పార్క్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో వన్డేలో తస్కిన్ చెలరేగిపోయాడు. మొత్తం 9 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు, ఇదే మైదానంలో జరిగిన మొదటి వన్డేలో కూడా సత్తాచాటాడు తస్కిన్. మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఆ వన్డేలో బంగ్లాదేశ్ గెలిచింది. రెండో వన్డేలో సౌతాఫ్రికా నెగ్గగా మూడో వన్డేలో తస్కిన్ సహకారంతో బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్ను గెల్చుకుంది.
కాగా మైదానం లోపలా, బయటా పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న తస్కిన్.. రెండోసారి వన్డే మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాడు. సుమారు 8 సంవత్సరాల క్రితం 2014లో, మీర్పూర్లో భారత్పై అరంగేట్రం చేస్తున్నప్పుడు, తస్కిన్ 28 పరుగులకు 5 వికెట్లు తీసి భారత్ను 105 పరుగులకే కుప్పకూల్చాడు
కాగా సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు పేసర్ తస్కిన్ అహ్మద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.