Heavy Rains: భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.. ఇప్పటికే 28 మంది మృతి
ఉత్తర భారత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి.
Updated on: Jul 10, 2023 | 7:40 PM

ఉత్తర భారత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి.

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటిదాక 28 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మరో రెండు రోజుల్లో ఆయా రాష్ట్రాలకు భారీ వరద ముప్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే తుపానులు, రుతుపవనాల పరస్పరం కలిసిపోవడం వల్లే వాయువ్య భారత్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ఇటీవల పేర్కొంది. వాస్తవానికి రుతుపవనాలు లేనప్పుడు వెస్టర్న్ డిస్టర్బెన్స్ల ప్రభావం ఉంటుంది. కానీ రుతుపవనాల ఉన్న సమయంలోనే వీటి ప్రభావం ఉండటం వల్ల ఉత్తరభారత్లో భారీ వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర భారత్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది. అయితే ఇది సాధారణ వర్షపాతం(239 మి.మీల) కంటే ఎక్కువే. జూన్ నెల చివరినాటికి 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కానీ జులై తొలినాళ్లలో కురిసిన భారీ వర్షాలు ఈ లోటును పూడ్చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ హర్యాణా, జమ్మూకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు యమునా నది నీటిమట్టం కూడా వార్నింగ్ మార్క్ను దాటి ప్రమాదకర స్థాయికి చేరింది. అలాగే దేశంలో కూడా నీటిమట్టాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొంది.

ఇదిలా ఉండగా ఉత్తారాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై ప్రధానీ మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అలాగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.




