యుపీ, బెంగాల్పై ఓవైసీ నజర్.. యాక్షన్ ప్లాన్ ఇదే!
సింగిల్ ఎంపీ పార్టీగా లోక్సభలో తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. మెల్లిగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి...

Owaisi focusing on UP Bengal: సింగిల్ ఎంపీ పార్టీగా లోక్సభలో తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. మెల్లిగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసదుద్దీన్.. దశాబ్ధం క్రితమే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఏరియాలో ముందుగా మునిసిపాలిటీల్లో.. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలోను తమ పార్టీ సభ్యులుండేలా కార్యాచరణ అమలు చేశారు. అక్కడ సక్సెస్సయిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలపై ఆయన నజర్ పెట్టారు. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో అనూహ్యంగా అయిదు అసెంబ్లీ సీట్లను ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది.
ఒక్క సీటు కూడా రాదంటూ ఎద్దేవా చేసిన వారికి బీహార్ ఫలితాలు రాగానే దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ.. బీహార్ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముస్లింలు అధికంగా వున్న నియోజకవర్గాలను గుర్తించి.. అక్కడ పార్టీ క్యాడర్ డెవలప్ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న సీనియర్ ఓవైసీ.. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బెంగాల్పై ముందుగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా 2022లో జరిగే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోను ఎంఐఎం పార్టీ బరిలోకి దిగబోతోంది.
అయితే, ఎంఐఎం బరిలో వుండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నష్టం వాటిల్లుతోందని, బీజేపీతో లోపాయికారీ ఒప్పందం వల్లనే ఎంఐఎం పార్టీ వివిధ రాష్ట్రాల నుంచి చట్టసభలకు పోటీ చేస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముస్లింల ఓట్లను గణనీయంగా చీల్చడం ద్వారా పరోక్షంగా బీజేపీకి ఎంఐఎం పార్టీ దోహడపడుతోందన్నది వారి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను ఎంఐఎం నేతలు తోసిపుచ్చుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఏ మేరకు సానుకూల ఫలితాలను రాబట్టుకుంటుందో.. ఎవరి విజయావకాశాలు ఏ మేరకు దెబ్బకొడుతుందో వేచి చూడాల్సిందే.