Wolves: జనంపై తోడేళ్ల దాడులు ఎందుకు..? మనుషులపై ప్రతీకారమా
ఉత్తర్ప్రదేశ్లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తోడేళ్లు చాలా పకడ్బందీగా అదును చూసి దాడులు చేస్తుండటంతో యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. మనుషులను చంపే తోడేళ్లు ఎక్కడ కనిపించినా అక్కడే కాల్చి పడేయాలని సూచించింది.
పులుల సంచారం గురించి తరుచూ వింటుంటాం.. చిరుతల దాడులన్నీ చూశాం. కానీ ఫస్ట్ టైమ్ తోడేళ్లు దాడుల గురించి మాట్లాడుకుంటున్నాం. గత రెండు నెలల నుంచి యూపీలోని బహరాయిచ్ ప్రజలను బెంబేలెత్తిస్తున్న తోడేళ్లుకు అసలేమైంది..? చిన్న పిల్లలపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాయా..? తోడేళ్లు కూడా మనుషులపై పగబడతాయా..? అసలు 30 ఏళ్ల తర్వాత మళ్లీ జనాలపై ఎందుకు దాడి చేస్తున్నాయి.? అన్న ప్రశ్నలు ఇప్పుడు తొలిచేస్తున్నాయి.
ఈ ప్రశ్నలే ఇప్పుడు యూపీ ఫారెస్ట్ ఆఫీసర్స్కు సవాల్గా మారాయి. ఎందుకంటే కేవలం నెల రోజుల్లోనే 10 మందిపై దాడి చేసి చంపేశాయంటే… ఇదేం చిన్న విషయం కాదు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలే ఉండటం ఆందోళన కలిగించే అంశం. 30 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చేరారు. అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడిపోతున్నాయి. రాత్రైతే చాలు ఇళ్లపై దాడి చేసి చిన్నారులను ఎత్తుకెళ్లి పీక్కుతింటున్నాయి. ఇటీవల తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న ఐదేళ్ల పిల్లవాడిని నోట కరుచుకుని తీసుకెళ్లి చంపితినేశాయి. దీంతో తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి అని ఆర్డర్ పాస్ చేసింది యోగీ సర్కార్.
జనాన్ని చంపేస్తూ… యూపీ సర్కాన్ను ఇంతలా డిస్టబ్ చేస్తున్న తోడేళ్లకు అసలేమైంది…? చిన్నారులనే టార్గెట్ చేసి ఎత్తుకెళ్లి చంపేయడమేంటి..? సహజంగా అయితే తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై దాడి చేయవు. కానీ 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అలజడిని చూసి.. తోడేళ్లకు కూడా.. ప్రతీకారం ఉంటుందనే చర్చ సాగుతోంది. యూపీకి చెందిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయన్నారు. వాటి నివాసాలు, పిల్లలకు హాని చేస్తే… అవి కచ్చితంగా.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయన్నారు. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చన్నారు.
ఇటు గ్రామాస్తులు కూడా అదే మాట చెబుతున్నారు. ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. వాటిని తామే చంపామన్న అనుమానంతో తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని చెబుతున్నారు. తోడేళ్లు ప్రతికారంతోనే దాడి చేస్తున్నాయన్న భయంతో బహరాయిచ్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలు ఒంటరిగా అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లో చిన్న అలికిడి వినిపించిన ఉలిక్కిపడుతున్నారు. ఏ తోడేళ్ల గుంపుకు తాము ఆహారంగా మారిపోతామోనన్న భయంతో చాలా గ్రామాల్లో ప్రజలు పనులకెళ్లడం మానేశారు. ఊర్లలో దుకాణాలు మూసేశారు. పిల్లల స్కూల్ మానేశారు. కనీసం ఇంటి ముందు ఆడుకోవడానికి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు పింపించడం లేదంటే సిచ్యూవేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మనిషి రక్తం రుచి మరిగిన ఈ తోడేళ్లను పట్టుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇప్పటికే,.. ఆపరేషన్ భేడియా స్టార్ట్ చేసి… నాలుగింటిని పట్టుకుంది. అంతేకాకుండా తోడేళ్ల దృష్టి మరల్చడానికి రకరకాల వ్యూహాలు అమలు చేసింది. గ్రామాల సమీపంలో ఏనుగు పేడ, మూత్రాన్ని కూడా చల్లారు. అటవీశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ పెంచారు. పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మలను వాటికి ఎరగా వేసి పట్టుకునేందుకు ట్రై చేశారు. అయినా తోడేళ్ల దాడులు ఆగకపోయే సరికి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చారు సీఎం యోగి అదిత్యనాథ్. మనుషులను దారుణంగా చంపి తినేస్తున్న తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండని ఆదేశించారు.
తోడేళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులను అటవీ శాఖ అధికారులు విశ్లేషించారు. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కొరతతో గ్రామాలపైకి వస్తున్నాయని చెబుతున్నారు. ఆహారం దొరకనప్పుడు గ్రామాల్లో చిన్న పిల్లలపై అటాక్ చేస్తుంటాయని… పిల్లలైతే సులభంగా ఎరగా మారుతారు కాబట్టి.. ఒకసారి వేటాడిన తోడేళ్లు.. మళ్లీ మళ్లీ దాడి చేసేందుకు మొగ్గు చూపుతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.