రెండోసారి కరోనా ఎటాక్..? నిపుణుల హెచ్చరిక
మరో ఐదు రోజుల్లో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్-4 ముగియనుంది...ఈ నేపథ్యంలో దేశంలో మున్ముందు కరోనా తీవ్ర ఎలా ఉండనుంది..? వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే వివిధ కార్యకలాపాలకు అనుమతించటం, లాక్డౌన్ ఎత్తివేయటం చేస్తే....కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించదా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా రోజూ 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్టెన్లోకి చేరిపోయింది.. అటు మరణాల సంఖ్య దాదాపుగా 5 వేలకు చేరువలో ఉంది. కాగా, మరో ఐదు రోజుల్లో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్-4 ముగియనుంది…ఈ నేపథ్యంలో దేశంలో మున్ముందు కరోనా తీవ్ర ఎలా ఉండనుంది..? వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే వివిధ కార్యకలాపాలకు అనుమతించటం, లాక్డౌన్ ఎత్తివేయటం చేస్తే….కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించదా..? అనే సందేహాలు ఇప్పుడు సగటు మనిషిని ఆందోళనలో పడేస్తున్నాయి. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)నిపుణులు కూడా పలు హెచ్చరికలు చేస్తున్నారు.
కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్ను అరికట్టిన దేశాలు ఇప్పుడు ఆ నిబంధనలను వెంటనే సడలిస్తే.. రెండోసారి వైరస్ విజృంభించవచ్చని, ఈసారి తారాస్థాయిని చూడాల్సి వస్తుందని ప్రపంచ డబ్ల్యూహెచ్ఓ కు చెందిన నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచం ఇంకా కరోనా వైరస్ మొదటి దశకు మధ్యలోనే ఉందని అన్నారు. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉందని మైక్ ర్యాన్ తెలిపారు. వైరస్ మరోసారి ఎప్పుడైనా దాడి చేయొచ్చని హెచ్చరించారు.
‘అంటువ్యాధులు దశల వారీగా దాడి చేస్తాయి. మొదటి దశ తీవ్రత కొద్దిగా తగ్గిన దేశాల్లో సంవత్సరాంతంలో మళ్లీ దాని ప్రభావం కనిపిస్తుంది. తొలి దశ కట్టడికి తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేస్తే మరోసారి వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది’ అని మైక్ ర్యాన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న మైక్ ర్యాన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.