విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం.. యజమాని మీదకు వచ్చిన పామును 2 ముక్కలు చేసిన శునకం
కన్యాకుమారి జిల్లా తక్కలైలో విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది 'చించాన్' అనే శునకం. కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఓ భారీ నాగుపాముతో వీరోచితంగా పోరాడింది. పామును చంపినా, దాని విషం కారణంగా చించాన్ ప్రాణాలు కోల్పోయింది. యజమానుల పట్ల దాని అంకితభావం, ప్రాణత్యాగం అందరినీ కంటతడి పెట్టించాయి, స్థానికంగా విషాదాన్ని నింపింది.

విశ్వాసం అనగానే అందరికి మొదట మైండ్లో మెదిలే ఏకైక చిత్రం.. శునకానిదే. గుప్పెడు అన్నం పెడితే చాలూ.. ఉపకారం చేసిన వారికి అపాయం వస్తే.. వాటి ప్రాణాలు అడ్డువేసైనా అవి వారి ప్రాణాలను రక్షిస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఇంలాంటి ఘటనే కన్యాకుమారి జిల్లాలోని తక్కలై ప్రాంతంలో వెలుగు చూసింది. తన యజమానిని కాపాడేందుకు ఓ శునకం ఏకంగా పాముతోనే పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. కన్నియాకుమరి జిల్లా తక్కలైకి చెందిన వికేష్ అనే వ్యక్తి తన భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే గాయత్రి తల్లి పద్మకుమారి కూడా వీరితోనే కలిసి ఇంట్లో ఉంటుంది. అయితే వీరు గత కొన్నాళ్లుగా చించాన్ అనే రెండేళ్ల శునకాన్ని పెంచుకుంటున్నారు. వీరు ఆ శునకాన్ని తమ కుటుంబంలో భాగంగా చూసుకునేవారు.
అయితే ఇటీవల సాయంత్రం పూట పద్మకుమారి వాకిట్లో కూర్చొని ఉండగా.. అక్కడికి ఏడు అడుగుల పొడవున్న ఓ భారీ త్రాచుపాము వచ్చింది. అది గమనించిన పద్మకుమారి.. పెద్దగా కేకలు వేసింది. అది విన్న శనకం వెంటనే అక్కడికి వచ్చి.. పాముపై దాడి దిగింది. అయితే పామును కొరికేందుకు ప్రయత్నించగా.. ఆ పాము ఒక్కసారిగా శునకాన్ని కాటు వేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శునకం పామును నోటితో రెండు బాగాలుగా చీరేసింది.
అయితే పాము విషయం శరీరం మొత్తం పాకడంతో.. కొద్దిసేపటికే ఆ శునకం నురుగు కక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. తమను కాపాడేందుకు చించాన్ తన ప్రాణాలు సైతం వదిలేయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
