AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమాచల్‌కు పోటెత్తిన టూరిస్టులు.. హిల్‌ స్టేషన్లలో విపరీతమైన రద్దీ

హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. హిల్‌స్టేషన్లలో విపరీతమైన రద్దీ పెరగడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ ముందుకు కదలకపోవడంతో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హిమాచల్‌కు పోటెత్తిన టూరిస్టులు.. హిల్‌ స్టేషన్లలో విపరీతమైన రద్దీ
Himachal Pradesh
Ram Naramaneni
|

Updated on: Dec 25, 2023 | 9:52 PM

Share

హిమాచల్‌ప్రదేశ్‌కు టూరిస్టుల వరద కొనసాగుతోంది. క్రిస్‌మస్‌, ఇయర్‌ ఎండింగ్‌ కావడంతో జనం హిమాచల్‌ బాట పట్టారు. స్పిటీ లాహోటి హిల్‌స్టేషన్‌ పూర్తిగా మంచుతో నిండిపోయింది. అయినప్పటికి వేలాదిమంది టూరిస్టులు అక్కడికి చేరుకున్నారు. టూరిస్టు క్యాంప్‌ల్లో వాళ్లు సెదతీరుతున్నారు. మనాలీ హైవే కార్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్‌కు పర్యాటకులు ఇలా పోటెత్తడం కలిసి వచ్చే అంశం. అయితే మనాలీ చేరుకునే సరికే వారు పెట్టుకున్న సెలవులు అయిపోయేలా ఉంది పరిస్థితి. కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా గంటన్నర సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అటల్‌ టన్నెల్‌ నుంచి ఒక్కరోజే ఏకంగా 12 వేల వాహనాలు ప్రయాణించాయి. ప్రస్తుతం అటల్ టన్నెల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ నమోదయ్యింది. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో బైక్‌ల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కసోల్, బంజర్స్‌ తీర్థన్‌ వ్యాలీ వంటి ప్రదేశాల్లో గత మూడు రోజుల్లో 55 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. న్యూఇయర్‌ వరకు ఇదే సీన్‌ కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మనాలీలో 90 శాతం హోటళ్లు బుక్ అయ్యాయనీ.. ఇప్పటికీ కూడా బుకింగ్స్‌ కొనసాగుతున్నాయని హోటల్ యజమానులు తెలిపారు.

పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. పార్కింగ్‌ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైనే పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కెపాసిటీ మించి పర్యాటకులు ఇప్పటికే హిమాచల్‌ చేరుకున్నారని , వాళ్లందరికి వసతులు కల్పించడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…