Rains Video: హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం… మండి జిల్లాలో దారుణ దృశ్యాలు
హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. తాజాగా మండి జిల్లాలో భారీ వర్షం రాత్రికి రాత్రి అల్లకల్లోలం చేసింది. రాత్రి కురిసిన వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లా ఆస్పత్రి సమీపంలో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనాలు మట్టి దిబ్బల్లో...

హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. తాజాగా మండి జిల్లాలో భారీ వర్షం రాత్రికి రాత్రి అల్లకల్లోలం చేసింది. రాత్రి కురిసిన వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లా ఆస్పత్రి సమీపంలో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనాలు మట్టి దిబ్బల్లో కూరుకుపోయాయి. ఇళ్లు, ఆఫీసుల్లో భారీగా బురద పేరుకుపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం.. మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 రహదారులు ఉన్నాయి.
కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పుర్, హమిర్పుర్, చంబా, సిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ఉండొద్దని ప్రజలను హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్… సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద సహాయ చర్యల్ని CM సుఖ్వీందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
జూన్ 20 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్లో 42 ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. 25 క్లౌడ్ బరస్ట్లు, 32 చోట్ల కొండచరియలు విరిగిపడటం జరిగిందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి 161మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు SDMA అధికారులు. 251 ఇళ్లు పూర్తిగా, 11వందల 65 ఇళ్లు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. 468 రోడ్లు, 676 వాటర్ సప్లై స్కీమ్స్తో పాటు.. పంటలకు కూడా భారీగా నష్టం జరిగిందని చెబుతున్నారు హిమాచల్ అధికారులు.
