AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ గన్‌మ్యాన్‌ను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..!

ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కరేలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఆ వ్యక్తి చాలా సేపటి వరకు రోడ్డు మధ్యలో రక్తస్రావంతో, నొప్పితో విలవిలలాడుతూ పడి ఉన్నాడు.

అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ గన్‌మ్యాన్‌ను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..!
Irfan Gaddi Murder
Balaraju Goud
|

Updated on: Apr 09, 2026 | 6:51 PM

Share

ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కరేలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఆ వ్యక్తి చాలా సేపటి వరకు రోడ్డు మధ్యలో రక్తస్రావంతో, నొప్పితో విలవిలలాడుతూ పడి ఉన్నాడు. కొందరు వ్యక్తులు సమీపంలోనే నిలబడి ఉన్నారు. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. విచారణలో మృతుడికి అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది.

మృతుడిని మహమ్మద్ ఇర్ఫాన్ గడ్డి (50)గా పోలీసులు గుర్తించారు. ఇతను గతంలో అతీక్ అహ్మద్ సోదరుడైన అష్రఫ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేయడంతో పాటు, అతని ఆస్తి వ్యవహారాలను కూడా చూసుకునేవాడు. గత బుధవారం సాయంత్రం, ఇర్ఫాన్ గడ్డి గౌస్ నగర్‌లోని బిస్మిల్లా స్క్వేర్ సమీపంలో ఉన్న ఒక దుకాణంలో టీ తాగుతున్నాడు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు మోటార్‌ సైకిల్‌పై అక్కడికి వచ్చారు. వారు వెంటనే ఇర్ఫాన్ గడ్డిపై కాల్పులు జరిపారు. దీంతో అతను తీవ్ర రక్తస్రావంతో నేలపై పడిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే కరేలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, డీసీపీ సిటీ మనీష్ కుమార్ షండిల్య, ఏడీసీపీ సిటీ రాజ్‌కుమార్ మీనా ఒక పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇర్ఫాన్‌ను ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.

ప్రాథమిక పోలీసు విచారణలో ఇర్ఫాన్ గడ్డికి ఆస్తి విషయాలకు సంబంధించి కొందరు వ్యక్తులతో వివాదం ఉన్నట్లు తేలింది. ఈ ఘర్షణ కాల్పులకు దారితీసింది. దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు సంఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం డీసీపీ సిటీ మనీష్ కుమార్ షండిల్య ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలావుంటే, ఇర్ఫాన్ గడ్డి ఒకప్పుడు మాఫియా డాన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఇర్ఫాన్, అతీక్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను అష్రఫ్‌కు గన్‌మ్యాన్‌గా ఉండటంతో పాటు, ఆస్తి లావాదేవీల వ్యాపారాన్ని కూడా పర్యవేక్షించేవాడు. అతీక్, అష్రఫ్‌ల హత్యల తర్వాత, ఆస్తి లావాదేవీల వ్యాపారంలో అతను పాక్షికంగా బాధ్యత వహించాడు. ఈ విషయంపై ఇర్ఫాన్‌కు కొంతమంది వ్యక్తులతో వివాదం ఏర్పడింది. ఈ వివాదమే అతని హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

ఇర్ఫాన్‌తో చకియాకు చెందిన ఆసిఫ్ దుర్రానీతో పాత కక్షలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అయితే, పోలీసులు ఈ విషయంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యుడి ఫిర్యాదు ఆధారంగా, ఆసిఫ్ దుర్రానీ, మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పాత కక్షలతో సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఏడీసీపీ రాజ్‌కుమార్ మీనా తెలిపారు. అనేక ఆధారాలు లభించాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

2023 ఏప్రిల్ 15న అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లోని కోల్విన్ ఆసుపత్రి సమీపంలో వైద్య పరీక్షల కోసం అతీక్, అతని సోదరుడు అష్రఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకువెళుతుండగా, ముగ్గురు దుండగులు వారిపై కాల్పులు జరిపి చంపారు. ఈ ఘటన మొత్తం ప్రత్యక్ష ప్రసారంలో దేశవ్యాప్తంగా టెలి కాస్ట్ అయ్యింది. అతీక్ అహ్మద్ తలపై బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ దాడిలో అష్రఫ్ కూడా మరణించాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us