Set Top Box: కేంద్రం కీలక నిర్ణయం..! కాలగర్భంలో కలిసిపోనున్న టీవీ సెటాప్ బాక్సులు.. ఇకపై..

ఒకప్పుడు దూరదర్శన్ టీవీ మాత్రమే ఉండేది.. ఆ తర్వాత టెలివిజన్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో కెబుల్, సెటాప్ బాక్సుల వరకు విస్తరించింది.

Set Top Box: కేంద్రం కీలక నిర్ణయం..! కాలగర్భంలో కలిసిపోనున్న టీవీ సెటాప్ బాక్సులు.. ఇకపై..
Set Top Box
Follow us

|

Updated on: Feb 14, 2023 | 8:16 PM

ఒకప్పుడు దూరదర్శన్ టీవీ మాత్రమే ఉండేది.. ఆ తర్వాత టెలివిజన్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో కెబుల్, సెటాప్ బాక్సుల వరకు విస్తరించింది. ఇప్పుడు సెటాప్ యుగం కూడా కనుమరుగు కానుందని తెలుస్తోంది. టెలివిజన్ సెట్‌లలో 200కి పైగా ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించడానికి అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్‌ను (built-in satellite tuner) కలిగి ఉండటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం తెలిపారు. దీని ద్వారా ప్రేక్షకులు సెట్-టాప్ బాక్స్‌లు లేకుండా టీవీ ప్రోగ్రామ్‌లను వీక్షించవచ్చని పేర్కొన్నారు.

అంతర్నిర్మిత ఉపగ్రహ ట్యూనర్‌లతో కూడిన టెలివిజన్ సెట్‌లు భవనం పైకప్పు లేదా ఇంటి గోడకి లేదా ప్రాంగణంలో చిన్న యాంటెన్నాను అమర్చడం ద్వారా ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్, రేడియో ఛానెల్‌ల స్వీకరణను ప్రారంభిస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ దూరదర్శన్ ఫ్రీ డిష్‌లో సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ల భారీ విస్తరణ జరిగిందని తెలిపారు. ఇది కోట్లాది మంది వీక్షకులను ఆకర్షించడంలో సహాయపడిందన్నారు.

ఇవి కూడా చదవండి

“నేను నా విభాగంలో కొత్తగా ప్రారంభించాను. మీ టెలివిజన్‌లో అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్ ఉంటే, ప్రత్యేక సెట్-టాప్ బాక్స్ అవసరం ఉండదు. ఒక క్లిక్‌తో 200 కంటే ఎక్కువ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు’’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.

దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను దశలవారీగా నిలిపివేసే ప్రక్రియలో ఉందlr.. డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్‌ని ఉపయోగించి ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌లు ప్రసారం చేయడం కొనసాగుతుందని తెలిపారు.

బిల్ట్-ఇన్ శాటిలైట్ ట్యూనర్‌ల కోసం బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ జారీ చేసిన ప్రమాణాలను పాటించేలా టెలివిజన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయాలని గత ఏడాది డిసెంబర్‌లో ఠాకూర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు.

ప్రస్తుతం, టెలివిజన్ వీక్షకులు చెల్లింపులతోపాటు, ఉచిత ఛానెల్‌లను వీక్షించడానికి సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేయాల్సిన విషయం తెలిసిందే. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడిన ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌ల (ఎన్‌క్రిప్టెడ్ కాని) రిసెప్షన్ కోసం కూడా వీక్షకుడు సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

2015 నుంచి దూరదర్శన్ ఉచిత డిష్ కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అవుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. KPMG నివేదిక 2015లో ఫ్రీ డిష్ వినియోగదారులను 20 మిలియన్లుగా పేర్కొంది. 2021లో ఈ సంఖ్య 43 మిలియన్లకు పెరిగింది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి విద్య అందుబాటులో ఉండేలా చూడడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు 1 నుంచి 12 తరగతులకు స్వయం ప్రభ చానెళ్లను రికార్డు సమయంలో ప్రారంభించామని ఠాకూర్ చెప్పారు.

నేడు అలాంటి 55 ఛానెల్‌లు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా తమ స్వంత ఛానెల్‌లను ప్రారంభిస్తున్నాయని తెలిపారు. న్యూస్ ఛానెల్‌లు కాకుండా, ఫ్రీ డిష్‌లో సాధారణ వినోద ఛానెల్‌లు విపరీతంగా విస్తరించాయని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..