
సమాజంలో మానవ విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే నేరాలకు పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో నిత్యకృత్యంగా మారాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. యథేచ్చగా నేరాలకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తి.. తన భార్య వైపు చూస్తున్నాడన్న కారణంతో అతని కుటుంబంపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లా దేవ్రన్ గ్రామంలో జగదీశ్ పటేల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి.. తరచూ తన భార్య వైపు చూస్తున్నాడన్న కారణంగా కోపం పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని అతనికి కూడా చెప్పాడు. అయినా అంతటితో ఆగకుండా జగదీశ్ పటేల్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామస్థులతో కలిసి అతని కుటుంబంపై తుపాకీతో కాల్పులు జరిపాడు.
కాగా.. బాధితుడు దళితుడు కావడం గమనార్హం. అలాంటి వ్యక్తి తన భార్య వైపు చూస్తున్నాడన్న అక్కసుతో నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో వ్యక్తి, అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతని సోదరులు గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జగదీశ్ పటేల్ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై అట్రాసిటీ కేసు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి