
జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నోముండీ పట్టణంలోని కాళీ ఆలయంలో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. తన చోర కళ పూర్తిచేసుకున్న తర్వాత పారిపోకుండా ఆలయంలోనే నిద్రపోయాడు. వివరాల్లోకి వెళ్తే… వీర్ నాయక్ అనే వ్యక్తి ఆలయం వెనుక తలుపు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. ఆలయంలో ఉన్న అలంకార వస్తువులు, పూజ తాళి, ఆభరణాలు, కిరీటం వంటి విలువైన వస్తువులు సంచిలో వేసుకున్న అతడు.. మద్యం మత్తులో మగతగా ఉండటంతో అక్కడే పడుకొని నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం ఆలయ పూజారి వచ్చి చూసే సరికి వీర్ నాయక్ నిద్రలో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అరెస్ట్ చేశారు. అతను చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. దొంగతనానికి ముందు వీర్ నాయక్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు విచారణలో వెల్లడైంది. దొంగతనానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో.. తాను నిద్రలోకి ఎలా జారిపోయానో గుర్తు లేదని పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి