సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు
తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల్లో అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ..

ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తమిళనాడు సీఎం విజయ్ చాటిచెప్పారు. తనకు బాగా సన్నిహితుడైన రాధన్ పండిట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రాధన్ కేవలం జ్యోతిష్యుడేగాదు, TVK పార్టీ సభ్యుడు కూడా. ఆయన్ను తన OSDగా నియమించారు విజయ్. అయితే ఈ నియామకంపై విమర్శలు రాగానే, వెనక్కి తగ్గారు. అసెంబ్లీలోనే మిత్రపక్షాలు నిలదీస్తే, ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వెంటనే నిర్ణయం ప్రకటించారు. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు చేస్తూ.. తాజాగా TVK సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 12న జారీ చేసిన నియామక ఉత్తర్వులను.. మే 13న ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నోట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తాను ఎలాంటి బేషజాలకు పోను అని.. విపక్షాల సూచనలు స్వీకరిస్తానని ఈ నిర్ణయంతో విజయ్ చెప్పకనే చెప్పారు.
