పాకిస్థాన్లో సన్నీ యాదవ్ ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరెవర్ని కలిశాడు? పోలీసుల విచారణలో..
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో రెండు నెలలు పర్యటించి, యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ పర్యటన తర్వాత చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ అయ్యాడు. ఎన్ఐఏ విచారణలో నాలుగుసార్లు పాకిస్తాన్ వెళ్ళినట్లు బయటపడింది. ఆయన తండ్రి, స్నేహితుడు విభిన్న వ్యాఖ్యలు చేశారు.

భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. పాకిస్తాన్లో పర్యటిస్తూ యూబ్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటివారిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టడంతో ఒక్కొక్కరి బండారం బట్టబయలు అవుతోంది.
పాకిస్తాన్లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేసిన సన్నీ యాదవ్.. రెండు నెలలపాటు అక్కడే ఉండి.. వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లో రీసెంట్ వీడియోస్ అన్నీ పాకిస్తాన్కు చెందినవే ఉండడంతో ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్ టూర్ ముగించుకుని రాగానే.. సన్నీయాదవ్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆయన టూర్ డిటేయిల్స్ కూపీ లాగడంతో నాలుగు సార్లు పాకిస్తాన్కు వెళ్లినట్లు తేలింది. దాంతో.. ఆయా సమయాల్లో సన్నీయాదవ్.. ఏఏ ప్రాంతాల్లో పర్యటించాడు?.. ఆయనకు షెల్టర్ ఇచ్చిందెవరు?.. అక్కడ రెండు నెలలపాటు ఏం చేశాడనే విషయాలను రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.
ఇదిలావుంటే.. సన్నీయాదవ్ అరెస్ట్పై ఆయన తండ్రి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సన్నీని అరెస్ట్ చేశారో.. ఎవరైనా ఎత్తుకెళ్లారో తెలియడం లేదన్నారు. తమ కుమారుడికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని.. సన్నీ దేశ భక్తుడని చెప్పుకొచ్చారు. కేవలం బైక్ రైడర్గానే పాకిస్తాన్ వెళ్లాడన్నారు రవీందర్. మరోవైపు.. సన్నీయాదవ్ని దేశ ద్రోహిగా చిత్రీకరించడం సరికాదన్నారు ఆయన ఫ్రెండ్ చెర్రీ. సన్నీ.. నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని చెప్పారు.
ఇక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే సన్నీయాదవ్పై సూర్యాపేట జిల్లా నూతన్కల్లో కేసు నమోదైంది. ఆ టైమ్లో ఆయన విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు.. పాకిస్తాన్లో పర్యటన.. వీడియోలు అప్లోడ్ వ్యవహారంలో సన్నీయాదవ్ మరో కేసులో చిక్కుకోవడం ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
