
ఎండల తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు అధికారికంగా కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. దీంతో దక్షిణ భారతదేశంలో వర్షాల కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయి.
కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు అక్కడ అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి చేరడానికి సాధారణంగా వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే రుతుపవనాల ముందస్తు ప్రభావం ఇప్పటికే తెలంగాణపై కనిపించడం ప్రారంభమైంది.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భానుడి భగభగలకు క్రమంగా బ్రేక్ పడుతోంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జారీ చేసిన హీట్వేవ్ హెచ్చరికలను కూడా ఉపసంహరించుకుంది.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, ఈదురుగాలులు, జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నైరుతి రుతుపవనాల పురోగతిని బట్టి తెలంగాణలో వర్షాల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైతులు కూడా ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందు కురిసే ఈ వర్షాలు వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వనున్నాయి.