అరుణాచల్లో అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టిన శాస్త్రవేత్తలు! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ విశ్వంలో మానవులతో పాటు రకరకాల జీవరాశులు నివసిస్తున్నాయి. వీటిలో కొన్ని జీవులు చాలా అరుదుగా కనిపిస్తూ వాటి ఉనికిని కాపాడుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఆరుదైన హిమాలయన్ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో ఉన్న ఎత్తైన పర్వత సరస్సులో సైప్రినిడే అనే జాతికి చెందిన షిజోపైగోప్సిస్ వాడెల్లి అనే చేపను గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. తాజాగా ఉత్తరాఖండ్లోని భీమ్తాల్కు చెందిన ICAR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ టీం, అరుణాచల్ మత్స్యశాఖ సహాయంలో ఓ అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టారు. ఇది ఎక్కువగా తవాంగ్ జిల్లాలో ఉన్న ఎత్తైన పర్వత సరస్సులో నివసిస్తోందని తెలిపారు. ఈ అరుదైన హిమాలయన్ చేపను మన దేశంలో గుర్తించడం ఇదే తొలిసారని.. దీంతో భారతదేశ మంచినీటి జీవవైవిధ్య జాబితాలోకి మరో కొత్త జాతి చేరిందని అధికారులు తెలిపారు.
ICAR రీసెర్చ్ టీంతో పాటు తవాంగ్కు చెందిన షార్-త్సో కమిటీ గత జూలై నెలలో వీటి నమూనాలను సేకరించారు. అయితే ఇవి సైప్రినిడే కుటుంబానికి చెందినవి.. ఇవి ప్రధానంగా టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తైన మంచినీటి సరస్సులలో మాత్రమే కనిపిస్తాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇవి నివసిస్తాయని తెలిపారు. అయితే ఇప్పుడు ఇది తవాంగ్లోనూ కనిపించడంతో వీటి జాతి భౌగోళిక పరిధి దేశవ్యాప్తంగా విస్తరిస్తురించొచ్చని అధికారలు భావిస్తున్నారు.
ఈ చేపలు చూడ్డాన్ని స్థూపాకారంలో ఉండి పొడవాటి శరీర నిర్మాణ్ని కలిగి ఉంటాయి. అలాగే వాటి పైభాగం ముదురు బూడిద లేదా ఆలివ్ రంగు ఉంటుంది, కింది భాగం వెండి-తెలుపు రంగులో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మూతి మొద్దుబారి, కింది పెదవి వద్ద గట్టి పలక వంటి నిర్మాణం, లోతైన చీలిక గల తోక రెక్కను కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ ఆవిష్కరణతో అరుణాచల్ ప్రదేశ్లోని ఎత్తైన సరస్సులలో ఇంకా ఎన్నో తెలియని జీవజాతులు ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అంతేకాదు తూర్పు హిమాలయాలు, ట్రాన్స్-హిమాలయ ప్రాంతాల మధ్య ఉన్న జీవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఈ పరిశోదనపై అరుణాచల్ సీఎం సైతం స్పందిస్తూ శాస్త్రవేత్తలను, మత్స్య శాఖను అభినందించారు. తమ రాష్ట్రంలో ఉన్న సహజ సంపద ఉనికిని కాపాడుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
